ప్రపంచంలో ఇప్పటివరకూ 10 శాతం మంది ప్రజలు కరోనా బారిన పడి ఉండొచ్చనేది తమ అంచనా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ వ్యవహారాల చీఫ్ డా. మైక్ రయాన్ తెలిపారు. అయితే..ఇది ఓ సగటు మాత్రమేనని, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను బట్టి ఈ సంఖ్య మారే అవకాశం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా వివిధ వర్గాల ప్రజల మధ్య కూడా కరోనా వ్యాప్తికి సంబంధించి వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కరోనా ప్రమాద తీవ్రతలో మార్పులు వస్తాయని, అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తగు వ్యూహాలు అందుబాటులో ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు.
అధికారిక లెక్కల ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయన్న విషయం గమనార్హం. అయితే ఈ అంచనాలు హెర్డ్ ఇమ్యూనిటీ ఆశలపై నిళ్లు చల్లేవిగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కరోనా సంక్షోభం ప్రారంభమై ఏడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ 90 శాతం మంది ప్రజలకు కరోనా సోకే అవకాశం ఉండటంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా టీకా అవసరాన్ని ఈ పరిస్థితి మరింత స్పష్టంగా చూపిస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

More Stories
అమెరికా 15-సూత్రాల శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్!
యూఎస్ఎస్ అబ్రహం లింకన్పై ఇరాన్ క్షిపణి ప్రయోగం!
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు తొలగిస్తేనే చర్చలు