ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత 

కరోనా కాటుకు విఎంఆర్‌డిఎ చైర్మన్‌, మాజీ శాసనసభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్‌ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. కరోనా బారినపడ్డ ద్రోణంరాజు శ్రీనివాస్‌ గత నెలరోజులుగా విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
చికిత్స అనంతరం కరోనా నుండి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌లోనే చికిత్స పొందారు. ఆదివారం మధ్యాహ్నం ద్రోణంరాజు శ్రీనివాస్‌ ను రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరామర్శించారు. 
 
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశించారు. కొద్దిసేపటి క్రితమే ద్రోణంరాజు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మృతి చెందినట్లు అధికార ప్రకటన చేశారు.  
 
విశాఖ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ద్రోణంరాజు శ్రీనివాస్… ప్రస్తుతం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) చైర్మన్‌గా ఉన్నారు‌. వీఎంఆర్‌డీఏకు తొలి చైర్మన్‌గా ఆయన రికార్డులకు ఎక్కారు.  
 
 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ తనయుడే శ్రీనివాస్ రావు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. శ్రీనివాస్‌ రావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ద్రోణంరాజు శ్రీనివాస్‌ మృతిపట్ల  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.​ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్‌ మరణం విశాఖ ప్రజలకు తీరనిలోటు అని పేర్కొన్నారు.