సినీ పారితోషికాల్లో 20శాతం కోత  

కరోనా మహమ్మారి తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 6 నెలల పాటు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు ప్రారంభించి.. ఈ నెల 15నుంచి థియేటర్లు కూడా పున: ప్రారంభానికి అనుమతులు రావడంతో  కాస్త ఊపిరి పీల్చుకుంది.

అయితే .భవిష్యత్తులో సినీ నిర్మాణపరంగా అనేక మార్పులు రాబోతున్నాయి. అందులో భాగంగానే నటీనటులు, సాంకేతికనిపుణుల పారితోషికంలో కోత విధించాలని  యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయించింది. భవిష్యత్‌లో తెలుగు సినీ రంగం పలు సవాళ్లను అధిగమించాల్సి వుందని, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నామని యాక్టివ్ తెలుగు నిర్మాతల గిల్డ్ తెలియజేసింది.

ఈ కష్టసమయాల్లో సినీరంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుంది కాబట్టి ఈ సంక్షోభ పరిస్థితుల్ని కలిసికట్టుగా అధిగమించడానికి,  పారితోషికాలు తగ్గించుకునే అంశంలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌తో డిస్కషన్స్ జరిపామని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ పేర్కొంది. లాక్‌డౌన్‌కు ముందు నిర్ణయించిన పారితోషికాల్లో 20శాతం కోత ఉంటుందని తెలిపింది.

రోజుకు ఇరవైవేల పారితోషికం తీసుకునే ఆర్టిస్టులకు ఇందులో  మినహాయింపు ఉంటుందని, ఒక సినిమాకు ఐదు లక్షలకు మించి పారితోషికం తీసుకునే సాంకేతిక నిపుణులు కూడా రెమ్యునరేషన్‌లో 20 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుందని తెలియజేసింది.

సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఈ నియమంపై మరోసారి సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తెలిపింది.