జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్‌   

జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పారు. అయితే వ్యాక్సిన్‌ పంపిణీలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు.
 ‘ఇండియా టుడే హెల్త్‌గిరి అవార్డ్స్‌ 2020 సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు, వ్యాక్సిన్‌ సమర్థత వంటి అనేక అంశాలపై ఆధారపడిని ఉంటుందని తెలిపారు. అంతా అనుకున్నట్లే జరిగితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికే వ్యాక్సిన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
అయితే ప్రారంభంలోనే దేశ జనాభా మొత్తానికి సరిపడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాదని తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి ముందుగా ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
కాగా వైద్య, ఆరోగ్య రంగంలో పనిచేసేవారిని, కరోనా వారియర్స్‌ను ఒక వర్గంగానూ, కరోనాతో ప్రాణాపాయ స్థితలో ఉన్నవారిని మరొక వర్గంగానూ విభజించి వీరికి ముందుగా వ్యాక్సిన్‌ ఇవ్వడంపై సమాలోచనలు జరుగుతున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌ ఇవ్వడంతో ప్రాధాన్యతా క్రమాన్ని కచ్చితంగా పాటించాలని చెబుతూ లేని పక్షంలో మరణా సంఖ్య పెరుగుతుందని హెచ్చరించారు.