టీఆర్ఎస్ కార్పొరేటర్లపై బిజెపి చార్జిషీట్ 

మరో కొద్దీ నెలల్లో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)  ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా బిజెపి దృష్టి సారించింది. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే సంస్థాగతంగా ఆరు జిల్లాలను విభజించి,  వాటికి అధ్యక్షులను కూడా నియమించింది. ఆ అధ్యక్షులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

త్వరలో బూత్ స్థాయిలో  పాదయాత్రలు చేపట్టేందుకు నేతలు సిద్ధంఅవుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై డివిజన్ల వారీగా ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలకు ముఖ్యంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు గ్రేటర్ హైదరాబాద్లోని డివిజన్ ఇన్చార్జులుగా బాధ్యతలను అప్పగించే పనిలో బీజేపీ నిమగ్నమైంది.

ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ రెండు సర్వేలను నిర్వహించినట్లు తెలిసింది. ఆ సర్వేల్లో పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని తేలడంతో రాష్ట్ర నాయకత్వం ఎన్నికల వేగంను మరింత పెంచింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ లను కలుపుకొని పార్టీ అభ్యర్థుల ఎంపికపై బండి సంజయ్ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది.

మొత్తం జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 146 డివిజన్లు టీఆర్ఎస్ చేతిలోనే ఉండడంతో అధికార పార్టీ కార్పొరేటర్లపై చార్జి షీట్ రెడీ చేసే పనిలో  బీజేపీ నేతలు ఉన్నారు. ప్రస్తుతం గ్రేటర్లో బీజేపీకి నలుగురు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలతో విసిగిపోయిన వారిని గుర్తించి చేరదీసేందుకు సిద్ధమవుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల హామీని నిలబెట్టుకోలేదని, గ్రేటర్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, కరోనాను నియంత్రణ చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని జనం కోపంగా ఉన్నట్లు తమ సర్వేలో తేలిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.