కోర్ట్ ముందుకు సంజయ్ రౌత్ ఆడియో 

కంగనా రనౌత్‌ కార్యాలయాన్ని కూల్చివేసిన సమయంలో శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడిన ఆడియో రికార్డింగ్‌ను ఆమె తరపు న్యాయవాది బాంబే హై కోర్టులో వినిపించారు.  కంగనా  కార్యాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారించిన సందర్భంగా కంగనాపై సంజయ్‌ బెదిరింపులకు పాల్పడినట్లు కలిగిన ఆడియో రికార్డింగ్‌ను కోర్టులో ప్లే చేశారు. 
 
అందులో కంగనాపై సంజయ్‌ రౌత్‌‌ అసభ్యంగా మాట్లాడినట్లు ఉంది. అయితే ఈ ఆడియోను కోర్టులో వినిపించేందుకు సంజయ్‌ న్యాయవాది ప్రదీప్‌ తోరట్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఆ ఆడియోలో పిటిషనర్‌ (కంగనా) పేరు లేదని ఆయన కోర్టుకు తెలిపారు.
దీనిపై స్పందించిన కోర్టు సంజయ్‌ కంగనాను ఉద్ధేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేయలేదని నిరూపించుకునేందుకు స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయాలని ఆదేశించింది. దీనికి అంగీకరించిన సంజయ్‌ రౌత్‌ తరపు న్యాయవాది తాము మంగళవారం అఫిడవిట్‌ దాఖలు చేస్తామని తెలిపారు.
 
కాగా కంగనా రనౌత్‌ ముంబై క్రియలోనున్ను  అక్రమ కట్టడంగా పేర్కొంటూ బ్రిహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) కూలగొట్టిన విషయం తెలిసిందే. కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ కంగనా రనౌత్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఆపై కంగనా కార్యాలయ కూల్చివేతపై కోర్టు స్టే విధించి నటి పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేయాలని బీఎంసీని ఆదేశించింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మృతి కేసుపై ముంబై పోలీసుల దర్యాప్తు పట్ల తనకు విశ్వాసం లేదని కంగనా ప్రకటించడంతో వివాదం మొదలైంది. 
 
ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, శివసేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సంజయ్‌ రౌత్‌ తనను బెదిరించారని అంటూ ముంబైని పీఓకేతో కంగనా పోల్చడం కలకలం రేపింది.