మూసీ ప్రక్షాళన పర్యవేక్షణకు ఎన్‌జిటి కమిటీ

తెలంగాణాలో మురికికూపంలా తయారైన మూసీ ప్రక్షాళనపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ పర్యవేక్షణ (మానిటరింగ్‌) కమిటీని నియమించింది. ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ విలాస్‌ అఫ్జల్‌పుర్కర్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ కమిటీలో కేంద్ర, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండళ్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను సభ్యులుగా నియమించారు. 
 
మహ్మద్‌ నహీంపాషా వేసిన పిటిషన్‌పై విచారణలో భాగంగా జస్టిస్‌ అదర్శ్‌కుమార్‌గోయల్‌ నేతృత్వంలోని జాతీయహరిత ట్రిబ్యునల్‌ న్యూఢిల్లీ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా 351 నదుల కాలుష్యంపై విచారిస్తున్న ట్రిబ్యునల్అం దులోభాగంగా మూసీకి సంబంధించి తాజా ఉత్తర్వులు వెలువరించింది. 
 
మూసీప్రక్షాళనపై గతంలో వెల్లడించిన ఉత్తర్వులు, నిపుణుల కమిటీ నివేదిక,  అందులోభాగంగా తెలంగాణ జలమండలి, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మూసీ ప్రక్షాళనకు చేపట్టిన చర్యలను కూడా ఎన్జీటీ తన ఉత్తర్వుల్లో పొందుపరిచింది. 
 
కమిటీ అవసరమైతే ఇతర నిపుణులు, సంస్థల సహకారం తీసుకోవచ్చని, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద నదుల కాలుష్యాన్ని నివారించేందుకు జీవవైవిధ్య పార్కులు, వెట్‌ల్యాండ్‌ల ఏర్పాటు వంటివి కూడా చేపట్టవచ్చని తెలిపింది. నెలరోజుల్లోగా కమిటీ తన మొదటి సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించింది. 
 
నెలరోజుల్లో మానిటరింగ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని ఎన్‌జిటి ఆదేశించింది.  నాలుగు నెలల్లోగా మెయిల్‌ ద్వారా తన మొదటి నివేదికను సమర్పించాలని సూచించింది. మూసీ ప్రక్షాళన ప్రక్రియను ఏడాదిలోపు పూర్తిచేయాలని స్పష్టంచేసింది.
కాగా, ఇప్పటివరకు మూసీప్రక్షాళన చర్యలకు సంబంధించి రూ.528.30 కోట్లు అంటే ఒక మిలియన్‌ గ్యాలన్‌కు రూ.45 లక్షల వ్యయంగా పేర్కొన్నారని.. అయితే ఇది నేషనల్‌ మిషన్‌ఫర్‌ క్లీన్‌ గంగా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సమర్పించిన వివరాల ప్రకారం చూస్తే 20 రెట్లు అధికంగా ఉన్నదని తెలిపింది. సంబంధిత యంత్రాంగం ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించింది.