భారతీయ సంస్కృతికి ఈశాన్యమే ఆభరణం  

భారతీయ సంస్కృతికి ఈశాన్య సంస్కృతి ఆభరణమని కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా తెలిపారు. ఈశాన్యం లేకుండా భారతదేశం, భారతీయ సంస్కృతి అసంపూర్ణమని స్పష్టం చేశారు. ఈశాన్య సంస్కృతి భారత సంస్కృతిలో కలిసే వరకు భారతీయ సంస్కృతిని పూర్తిగా ఊహించలేమని, ఎందుకంటే ఈశాన్య సంస్కృతి భారతీయ సంస్కృతికి ఆభరణమని ఆయన చెప్పారు.

‘డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ 2020 ’ఫెస్ట్‌ను ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమిత్ షా ప్రారంభిస్తూ  ఆర్థిక వ్యవస్థ, పర్యాటక రంగం, ఉపాధిపై దృష్టి సారించి ఈశాన్యంలో శాంతిని సుస్థిరం చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. ఒకప్పుడు తిరుగుబాటు, హింస, బంద్‌లకు పేరుగాంచిన ఈశాన్యం గత ఆరున్నర ఏండ్లలో అభివృద్ధి, పరిశ్రమలు, సేంద్రీయ వ్యవసాయం, స్టార్టప్‌లకు మారుపేరుగా నిలిచిందని అమిత్ షా కొనియాడారు.

కాగా, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏటా ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘డెస్టినేషన్ నార్త్ ఈస్ట్’ ఫెస్ట్‌ నిర్వహిస్తారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ ఈవెంట్‌లో ఈశాన్య పర్యావరణ పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, వ్యాపారం వంటి రంగాలను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు చేపడతారు.