అడవిలో కల్మషం లేకుండా బతుకుతున్న ఆదివాసీలపై మావోయిస్టులు దారుణ ఊచకోతకు పాల్పడుతున్నారు. ఇన్ఫార్మర్ల నెపం మోపి పచ్చని అడవిలో నెత్తురు పారిస్తున్నారు. ఛత్తీస్గఢ్ పరిధిలోని దండకారణ్యంలో ఐదురోజుల వ్యవధిలోనే 16 మంది ఆదివాసీలను దారుణంగా హత్యచేశారు. నెల వ్యవధిలోనే 20మందిని పొట్టన పెట్టుకున్నారు.
మావోయిస్టులు ఆదివాసీ గూడేలపై పడి వరుస దాడులు చేస్తూ విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌరుగట్ట, కోమట్పల్లి, జబ్బకట్ట, తెమ్రేలు, సింగం, ధర్మారం తదితర గ్రామాలకు చెందిన 16 మంది ఆదివాసీలను అపహరించిన మావోయిస్టులు, వారిని చిత్రహింసలు పెట్టి హత్యచేశారని స్థానికులు చెప్తున్నారు.
మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆసరాగా చేసుకొని స్థానిక గూడేల్లోని ప్రజలను బలవంతంగా సమావేశపర్చి 1500 మందితో ప్రజాకోర్టు నిర్వహించారు. ఆ సందర్భంగా మొదట నలుగురు గ్రామస్థులను హత్యచేశారు. అనంతరం ఇతర చోట్ల మరో 12 మందిని హత్యచేసినట్లు సమాచారం.
ఈ నెల మొదటివారంలో కూడా బీజాపూర్ జిల్లాలోనే 20 మంది గ్రామస్థులను కిడ్నాప్ చేసి వారిలో నలుగురిని చంపారు. మిగిలినవారిని తీవ్రంగా కొట్టి వదిలేశారు. మావోయిస్టుల దమనకాండతో ఏజెన్సీలో భీతావాహ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆదివాసీలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మావోయిస్టులకు భయపడి ఈ హత్యల విషయం వారు పోలీసులకు కూడా తెలపడం లేదు.
More Stories
మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం
2040 నాటికి రొమ్ము క్యాన్సర్తో మిలియన్ మరణాలు
అనంత్నాగ్ లో మరో వలస కార్మికుడి కాల్చివేత