న‌లుగురు హీరోయిన్ల ఫోన్స్ సీజ్    

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బాలీవుడ్‌ని కుదిపేస్తుంది. ప‌లువురు స్టార్ హీరోయిన్స్ ఇందులో భాగం అయ్యార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ (ఎన్‌సీబీ)  దర్యాప్తును వేగవంతం చేసింది.

ఇప్ప‌టికే రకుల్‌ ప్రీత్‌సింగ్‌, దీపిక పదుకొనె, సారా అలీఖాన్‌, శ్రద్దాకపూర్‌లను విచారించిన అధికారులు తాజాగా వారి ఫోన్స్‌ను కూడా సీజ్ చేసార‌ని తెలుస్తున్నది. వీరితో పాటు  దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌, జయ షాల ఫోన్ల్‌ను కూడా సీజ్‌ చేసినట్లు ఎన్‌సీబీ ఆదివారం ఉదయం వెల్లడించింది.

డ్ర‌గ్స్ కేసులో హీరోయిన్స్ నుండి అనేక విష‌యాలు రాబ‌డుతున్న ఎన్సీబీ శుక్రవారం ధర్మా ప్రొడక్షన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ క్షితిజ్‌ రవి ప్రసాద్‌ను అరెస్టు చేసింది. క‌ర‌ణ్ జోహార్ కు కూడా స‌మ‌న్లు జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

మరోవైపు కరిష్మా డ్రగ్స్‌ గురించి జరిపిన వాట్సాప్‌ చాట్‌లో ‘డి’అనే అక్షరం ఆధారం చాటింగ్‌ చేసినట్లు 7 గంటల సుదీర్ఘ విచారణలో వెల్లడైంది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి చేశారు అనేదానిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే మరికొన్ని ఆధారాల కోసం వారి మొబైల్‌ ఫోన్స్‌ సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ముగిసిన విచారణలో రకుల్ నుండి ఎన్‌సీబీ అధికారులు  పలు కీలక విషయాలను రాబట్టారు. రియాకు రకుల్‌కు మధ్య డ్రగ్స్‌ గురించి వాట్సప్‌లో చాటింగ్‌ జరిగినట్లు, తన నివాసంలో లభ్యమైన డ్రగ్స్‌ కూడా రియాకు చెందినట్లు రకుల్‌ వెల్లడించింది.