ఢిల్లీలో హింస వ్యాప్తికి మూడు అంచెల వ్యూహం   

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మోకరిల్లే విధంగా చేయడమే లక్ష్యంగా ఢిల్లీ అల్లర్లు జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తాజా అభియోగ పత్రంలో ఆరోపించారు. దేశ రాజధాని నగరంలో హింసను వ్యాపింపజేయడానికి మూడు అంచెల వ్యూహాన్ని కుట్రదారులు అమలు చేశారని పేర్కొంది.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సమర్థించేవారికి, వ్యతిరేకించేవారికి మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఈశాన్య ఢిల్లీలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో 53 మంది మరణించగా, సుమారు 200 మంది గాయపడ్డారు. 

ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పింజ్రా తోడ్ మెంబర్, నిందితుల్లో ఒకరు అయిన నటాషా నర్వాల్ తెలిపిన వివరాలను పేర్కొన్నారు. 3 ప్రధాన చర్యల ద్వారా మోదీ ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేయవచ్చునని తాము నిర్ణయించుకున్నట్లు నటాషా తెలిపినట్లు పేర్కొన్నారు. 

మొదట సీఏఏకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించాలని, ఆ తర్వాత రోడ్లను దిగ్బంధనం చేయాలని, చివరిగా అల్లర్లు సృష్టించాలని నిర్ణయించుకున్నట్లు నటాషా చెప్పినట్లు తెలిపారు. 

ఈశాన్య ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను తనకు, తన నేతృత్వంలోని పింజ్రా తోడ్‌కు అప్పగించారని నటాషా చెప్పినట్లు ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. తమను మీరన్ హైదర్, జామియా కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ సఫూరా జర్గర్ పర్యవేక్షించారని చెప్పినట్లు పేర్కొన్నారు. 

ఈ ప్రణాళిక ప్రకారం తనతోపాటు ప్రోమా రాయ్, దేవాంగన కలిత, మరికొందరు ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ వద్ద జనవరి 5 నుంచి నిరసన ప్రారంభించినట్లు చెప్పారని తెలిపారు. 

దేశ రాజధానిలో నిరసనల ముసుగులో అల్లర్లకు జామియా కోఆర్డినేషన్ కమిటీ ప్రణాళిక రచించినట్లు ప్రొఫెసర్ అపూర్వానంద్ తమకు చెప్పారని నటాషా వెల్లడించినట్లు పేర్కొన్నారు. హిందువులను దిగ్బంధిస్తే, ఉద్రిక్తతలు పెరుగుతాయని ఈ ప్రణాళిక రచించినట్లు చెప్పారని పేర్కొన్నారు.