రాణా కపూర్ రూ.127 కోట్ల లండన్ ఫ్లాట్ జప్తు 

జైలు శిక్షను అనుభవిస్తున్న ఎస్ బ్యాంక్ సహవ్యవస్థాపకుడు రాణాకపూర్ ఆస్తుల్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మనీల్యాండరింగ్ కేసులో రాణాకపూర్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు నిందితుల ఆస్తుల్ని జప్తు చేస్తున్నారు. 

తాజాగా లండన్ లో రానా కపూర్ కు చెందిన రూ.127కోట్ల అపార్ట్ మెంట్ ను అటాచ్ చేసుకున్నట్లు ప్రకటించారు. లండన్ లో 77 సౌత్ ఆడ్లీ స్ట్రీట్ లోని అపార్ట్ మెంట్ యూకే కరెన్సీలో 13.5 మిలియన్ పౌండ్ల మార్కెట్ విలువను కలిగి ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. 

ఈ అపార్ట్ మెంట్ ను 2017 లో రాణాకపూర్ రూ.93 కోట్లకు డాయిట్ క్రియేషన్స్ జెర్సీ లిమిటెడ్ పేరిట ఈ ఆస్తిని కొనుగోలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా రాణా కపూర్‌ తదితరులపై మనీ ల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి అడాగ్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన తొమ్మిది కంపెనీలు యస్‌ బ్యాంక్‌ నుంచి రూ. 12,800 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి.

బడా కార్పొరేట్లకు యస్‌ బ్యాంక్‌ ద్వారా రుణాలిప్పించినందుకు గాను రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు రూ. 4,300 కోట్ల పైగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.