భారత్, శ్రీలంక స్నేహం వెయ్యేళ్ల పురాతనమైనది

పొరుగు దేశాలకు ప్రాధాన్యతనిచ్చే విషయంలో శ్రీలంకకు ఎప్పుడూ భారత్ ప్రాధాన్యమిస్తూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

‘పొరుగు దేశాల ప్రథమ ప్రాధాన్యం, భద్రత, సర్వతోముఖాభివృద్ధి’ అన్న సిద్ధాంతంలో శ్రీలంకకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్సేతో ప్రధాని మోదీ శనివారం ‘వర్చువల్ కాన్ఫరెన్స్’ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్, శ్రీలంక సంబంధాలు దాదాపు వెయ్యేళ్ల పురాతనమైనవని తెలిపారు. 

‘‘ఇరు దేశాల మధ్య వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ కు ఒప్పుకున్నందుకు మీకు ధన్యవాదాలు. శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి, ప్రధాని పగ్గాలు చేపట్టినందుకు కూడా మీకు శుభాకాంక్షలు’’ అని మోదీ పేర్కొన్నారు.

శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే మాట్లాడుతూ… కరోనా సమయంలో ఇతర దేశాల సహాయార్థం విషయంలో భారత్ ఇతర దేశాల కోసం పనిచేసినందుకు కృతజ్ఞతలు ప్రకటించారు. ఎం.టీ. న్యూడైమండ్ నౌకలో తలెత్తిన మంటలను అరికట్టే ఆపరేషన్ ఇరు దేశాల మధ్య మరింత బంధాన్ని పెంచిందని రాజపక్సే పేర్కొన్నారు.