రకుల్‌ ఇంటి నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం   

దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారంలో నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ శుక్రవారం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆమె పలు కీలక, కొత్త విషయాలను వెల్లడించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కథనాల ప్రకారం.. ముంబైలోని రకుల్‌ ఇంటి నుంచి ఎన్‌సీబీ అధికారులు గురువారం డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం నాలుగు గంటలపాటు సాగిన విచారణలో ఇదే అంశంపై రకుల్‌ను  అధికారులు ప్రశ్నించగ. ఆ డ్రగ్స్‌ సుశాంత్‌ సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తికి చెందినవని రకుల్‌ చెప్పినట్టు  తెలుస్తున్నది. డ్రగ్స్‌ సరఫరాకు రియా తన ఇంటిని వాడుకునేదని అధికారులకు రకుల్‌ వెల్లడించినట్టు తెలుస్తున్నది.

అయితే, డ్రగ్స్‌ దొరికినట్టు చెబుతున్న నివాసం నిజానికి తన ఇల్లు కాదని రకుల్‌ ఈ సందర్భంగా అధికారులతో చెప్పినట్టు సమాచారం. మరోవైపు, డ్రగ్స్‌కు సంబంధించి తనకు, రియాకు మధ్య చాటింగ్‌ జరిగినట్టు రకుల్‌ ఒప్పుకున్నట్టు మీడియా వెల్లడించింది. అయితే, తానెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, డ్రగ్స్‌ సరఫరా చేసే వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసిన్నట్లు తెలిసింది.

డ్రగ్స్‌ వ్యవహారంలో సమన్లు అందుకున్న నటి దీపికా పదుకొనె, మరో నటి సారా అలీఖాన్‌ శనివారం ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో తారల మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌ వివరాలు కీలక ఆధారాలుగా మారడం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్‌సీబీ ఈ చాటింగ్‌ను ఎలా వెలికితీసింది? వాట్సాప్‌లో ఇద్దరి మధ్య జరిగే చాటింగ్‌ను మూడో వ్యక్తులు తెలుసుకోవచ్చా? అనే పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో వాట్సాప్‌ ప్రతినిధి ఒకరు దీనిపై స్పందిస్తూ  వాట్సాప్‌లో వ్యక్తిగతంగా, గ్రూపు స్థాయిలో జరిగే చాటింగ్‌ను ఇతరులేగాక, స్వయంగా వాట్సాప్‌ సంస్థ కూడా తెలుసుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహా ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారని, ఇందులో డ్రగ్స్‌కు సంబంధించిన చాటింగ్‌ జరిగేదని శుక్రవారం ఓ ఇంగ్లిష్‌ ఛానెల్‌ వార్తను ప్రసారం చేసింది.

ఈ వాట్సాప్‌ గ్రూప్‌లో దీపిక పదుకొనె, జయా సాహా, కరీష్మా ప్రకాశ్‌, క్వాన్‌ టాలెంట్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు అనిర్‌బన్‌ దాస్‌ తదితరులు గ్రూప్‌ అడ్మిన్‌లుగా ఉన్నట్టు పేర్కొంది. త్వరలో ఏర్పాటు చేయబోయే పార్టీలో తనకు డ్రింక్స్‌ కంటే ముందు మాల్‌ (డ్రగ్స్‌) కావాలని దీపిక పదుకొనె.. జయా సాహాను అడిగినట్టు 2017, అక్టోబర్‌ 28న జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా బయటపడిందని ఆ కథనం వెల్లడించింది.