రైతులకు కాసులు కురిపిస్తున్న ఆవుపేడ

రైతులకు ఆవు పేడ విక్రయం కాసులు కురిపిస్తోంది. చత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ ఆవు పేడ విక్రేతలు, రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.8.02కోట్లను బదిలీ చేశారు.
 
 గోధన్ నయా యోజన  పథకం కింద సెప్టెంబరు 1 నుంచి ఇప్పటివరకు 4,01,475 క్వింటాళ్ల ఆవుపేడను సేకరించారు. 83,809 మంది ఆవుపేడ విక్రేతలు, రైతుల బ్యాంకు ఖాతాల్లోకి తాజాగా 8.02కోట్ల రూపాయలను బదిలీ చేశారు. 
 
 గోధన్ నయా యోజన పథకం కింద పేద రైతులు, ఆవుల యజమానులు పేడ విక్రయం ద్వారా లబ్ధి పొందారని, వారికి రూ.20కోట్లను చెల్లించామని చత్తీస్ ఘడ్ సీఎం కార్యాలయ అధికారులు వెల్లడించారు. 
 
పేదరైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం బాగేల్ చెప్పారు. రాజీవ్ గాంధీ కిసాన్ యోజన, గోధన్ నయా యోజన పథకాల కింద గ్రామీణ రైతులు, కూలీల జీవనం మెరుగుపరుస్తున్నామని సీఎం చెప్పారు.