భారత్‌లో అల్‌ఖైదా దాడులు చేసే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ భారతదేశంలో చిన్న తరహా దాడులు జరిపే సామర్ధ్యం, అవకాశం ఉందని అమెరికా ఉగ్రవాద నిరోధక అధికారి క్రిస్టోఫర్ మిల్లెర్ అమెరికా చట్టసభ సభ్యులకు చెప్పారు. 

ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా సైనికుల దాడిలో అల్ ఖైదా నాయకుడు అసిమ్ ఉమర్ మృతి అనంతరం పుంజుకొని భారత ఉపఖండంలో  దాడులకు పాల్పడేందుకు సమాయత్తమైందని నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టరు క్రిస్టోఫర్ మిల్లెర్ తెలిపారు. 

అంతర్జాతీయ ఉగ్రవాదంపై అమెరికా పోరును రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించి, ఉగ్రవాదులను అణచివేసిందని మిల్లెర్ పేర్కొన్నారు. అమెరికాతోపాటు తమ మిత్ర దేశాల్లో ఉగ్రవాద ముప్పు తక్కువేనని మిల్లెర్ వివరించారు.

అల్ ఖైదా ఉగ్రవాదులు భారతదేశంతోపాటు బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్థాన్ దేశాల్లో మకాం వేసి దాడులకు కుట్రలు పన్నుతున్నారని గతంలో ఐక్యరాజ్యసమితి తన నివేదికలో హెచ్చరించింది. ఇటీవల కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 9మంది అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్టు అనంతరం వారి దాడుల కుట్ర భగ్నం అయింది.

ఢిల్లీతో సహా దేశంలోని పలు కీలక రక్షణ స్థావరాలపై దాడులు చేసేందుకు అల్ ఖైదా కుట్ర పన్నిందని, దీనికోసం ఆ ముఠా ఆయుధాలు, పేలుడు పదార్థాలు సేకరించే పనిలో ఉందని ఎన్ఐఏ దర్యాప్తులోనూ వెలుగుచూసింది.