భారత్‌ విమానాల రాకపోకలపై సౌదీ నిషేధం

కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ నుండి విమానాల రాకపోకలపై సౌదీ అరేబియా మంగళవారం నుండి నిషేధం విధించింది. ఈ మేరకు సౌదీ అరేబియా పౌర విమానయాన శాఖ మంగళవారం సర్క్యులర్‌ జారీ చేసింది. 
 
భారత్‌తో పాటు బ్రెజిల్‌, అర్జంటీనాలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఈ మూడు దేశాల్లో గత 14 రోజులుగా వున్న వ్యక్తులు ఇక్కడకు రావాలనుకున్న కూడా ఈ నిషేధాజ్ఞలు వర్తిస్తాయయని తెలిపింది. 
 
అయితే అధికారికంగా ప్రభుత్వ ఆహ్వానాలు వున్న ప్రయాణికులకు మాత్రం మినహాయింపు వుంటుంది. సౌదీ అరేబియా విమానాశ్రయాల్లో పనిచేస్తున్న అన్ని ఎయిర్‌లైన్స్‌, చార్టర్డ్‌ ఫ్లైట్‌ కంపెనీలన్నింటికీ ఇది వర్తిస్తుందని సర్క్యులర్‌ పేర్కొంది. 
 
సౌదీ అరేబియా, యుఎఇల్లో భారతీయుల సంఖ్య ఎక్కువ. కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుండి అంటే మార్చి 23 నుండి అంతర్జాతీయ విమానాల రాకపోకలను భారత్‌ నిలిపివేసింది. 
 
అయితే, వందే భారత్‌ మిషన్‌ కింద మే 6 నుండి భారత్‌, సౌదీ అరేబియాల మధ్య ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. బుధవారం నాటికి భారత్‌లో కరోనా కేసులుఉ 56,46,010కి చేరగా మృతుల సంఖ్య 90,020కి చేరింది.
 
 యుఎఇ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, భారత్‌ నుండి వచ్చే ప్రతి ప్రయాణికుడు తన ప్రయాణానికి 96గంటల ముందు చేయించుకున్న కొవిడ్‌ పరీక్ష సర్టిఫికెట్‌ తెచ్చుకోవాల్సి వుంది.
 
 హాంకాంగ్‌ కూడా ఆదివారం నుండి అక్టోబరు 3 వరకు ఎయిర్‌ ఇండియా విమానాలను నిషేధించింది. శుక్రవారం ప్రయాణంన చేసిన వారిలో కొద్దిమందికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు.