స్వీయ నిర్బంధంలో బండారు ద‌త్తాత్రేయ

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రాజ్‌భ‌వ‌న్‌లో ఏడీసీ అధికారికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేల‌డంతో ద‌త్తాత్రేయ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు. 

ఆయ‌న అన్ని అపాయింట్‌మెంట్ల‌ను ర‌ద్దు చేసుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శి రాకేశ్ క‌న్వ‌ర్‌తో పాటు ఏడీసీ సిబ్బంది మొత్తాన్ని క్వారెంటైన్ చేశారు. ఆరోగ్య‌శాఖ సిబ్బంది వారంద‌రికీ  కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ది.

ఇటీవ‌ల ఆ రాష్ట్రానికి చెందిన విద్యుత్ శాఖ మంత్రి సుక్రామ్ చౌద‌రీ, జ‌ల‌శ‌క్తి మంత్రి మ‌హేంద‌ర్ సింగ్ థాకూర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ ఇద్ద‌రూ కోలుకున్నారు.

ఇలా  ఉండగా, ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు  ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ప్రభుత్వ నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా తనను కలిసేందుకు వచ్చిన వారు కరోనా పరీక్ష పరీక్ష చేయించుకొని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆయన కోరారు.