తిరుమల కొండతో పెట్టుకుంటే బూడిదే

తిరుమలపై మంత్రి కొడాలి నాని చేసిన విపరీత వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. 

మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్‌కు వినిపిస్తున్నాయో? లేదో? తెలియదని, సీఎం స్పందించకపోతే ఆయనే మాట్లాడించారని అనుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తిరుమల దర్శనార్థం వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ‘డిక్లరేషన్’ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు.

తిరుమలపై ఇలాంటి వ్యాఖ్యానాలు గతంలో ఎప్పుడూ వినలేదని స్వామీజీ విస్మయం వ్యక్తం చేశారు. వివాదం రగిలితే, అది సద్దుమణిగేలా చేసే బాధ్యత సంబంధిత మంత్రులపై ఉంటుందని, కానీ మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. 

జగన్ ప్రభుత్వానికి 150 సీట్లు వచ్చాయని, అందులో 149 స్థానాలు హిందువులు ఓట్లు వేస్తేనే వచ్చాయని గుర్తించాలని అయన హితవు చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హిందువులు పెట్టుకున్న నమ్మకానికి సీఎం జగన్ పునాదులను కూడా పొడిచేస్తున్నారని హెచ్చరించారు.

ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాల గురించి ఏ రాజకీయ నేతా మాట్లాడడం లేదని, కేవలం హిందూ దేవాలయాల గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. మంత్రి కొడాలి నానికి ఏమాత్రం చరిత్ర తెలియదని, ఓసారి చరిత్రను తిరిగేయాలని స్వామీజీ హితవు పలికారు. 42 పాయింట్లతో డిక్లరేషన్ రూపొందించారని, ఇతర మతస్థులు దర్శనార్థం వెళితే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. కొడాలి నానీ భ్రమల నుంచి బయటికి రావాలని హెచ్చరించారు.

గతంలో ఓ పార్టీలో ఉండేవారని, ప్రస్తుతం మరో పార్టీలో ఉన్నారని, త్వరలో కొడాలి నానికి ఈ పార్టీపై ఉన్న భ్రమలు కూడా తొలిగిపోయి, ఇతర పార్టీలోకి వెళ్తారని స్వామీజీ ఎద్దేవా చేశారు. తిరుపతి ఎవడబ్బ సొత్తు అనడం చాలా దారుణమైన అంశమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమల డిక్లరేషన్ పై ప్రశ్నించడం అహంకారమే అవుతుందని స్వామిజి విమర్శించారు. దేవుళ్ల గురించి మాట్లాడే స్థాయి నానికి లేదని మండిపడ్డారు. తిరుమల కొండతో పెట్టుకున్న వారి బూడిద కూడ దొరకలేదని, ఆ చరిత్ర కూడా కళ్లముందే ఉందని పేర్కొన్నారు. దేవుళ్లతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతారని హెచ్చరించారు.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. జగన్ హిందువు అని, క్రైస్తవుడని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెబుతూ ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవుడే అయినా డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.  
ఈ విషయంపై జగన్ వెంటనే స్పందిచాలని, లేదంటే కేంద్ర జోక్యం చేసుకుంటుందని హెచ్చరించారు. మసీదులకు, చర్చిలకు ఉన్న స్వయం ప్రతిపత్తి దేవాలయాలకు ప్రభుత్వాలు ఎందుకివ్వడం లేదని నిలదీశారు. 

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కొడాలి నాని హిందువు కాలేడని, ఆయనలా తాను బజారు మాటలు మాట్లాడనని స్వామీజీ తేల్చి చెప్పారు. హిందువుల మనోభావాలను సీఎం జగన్ కచ్చితంగా గౌరవించాల్సిందేనని పరిపూర్ణానంద స్పష్టం చేశారు. 

వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని, మంత్రి నాని లాంటి వాళ్లు ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారని ఆరోపించారు. పీఠానికి ద్రోహం చేసిన జయలలిత ఎలా చనిపోయారో అందరూ చూశారని, ఇందిరా గాంధీ కూడా దిక్కులేకుండా చనిపోయిందని స్వామీజీ గుర్తు చేశారు.

మంత్రి నాని చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని, తన శాఖ తాను చూసుకుంటే సరిపోతుందని హితవుపలికారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని, జగన్ స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని పరిపూర్ణానంద స్వామీజీ పేర్కొన్నారు.