అధికారం, అభివృద్ధి సోము వీర్రాజు లక్ష్యం 

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి రావడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మనం పని చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.
రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం తొలిసారి బీజేపీ రాష్ట్ర పదాధికారుల, జిల్లాల అధ్యక్షులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ భేటీలో పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.
వాజ్‌పేయి ఆధ్వర్యంలో ‘సమృద్ భారత్’ పేరుతో అభివృద్ధి చేశారు. మనం ‘సమృద్ ఆంధ్ర’ పేరుతో ముందుకు సాగుతాం. అనేక రకాల కోణాల్లో ఏపీ అభివృద్ధి చెందాలనేదే బీజేపీ ఆలోచన. సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో దేశంలోనే ఆదర్శంగా ఉండేలా ఏపీని తయారు చేస్తాం అంటూ భరోసా వ్యక్తం చేశారు
 ‘వికసిత వికాస్’ పేరుతో… వికసించే ఆంధ్రాగా తీర్చిదిద్దేలాబాధ్యత చేపట్టాలని కోరారు.  ‘అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేలా కార్యక్రమాలు ఉండాలి. ఏపీలో 24 గంటలూ విద్యుత్‌ని తీసుకువచ్చాం. కోటి నలభై లక్షల గృహాల్లో కరెంట్ కోత అనేది లేదు. అదే బీజేపీ మంచి పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది’ అని తెలిపారు.
నిర్విరామమైన కార్యక్రమాలు, పోరాటాలతో ముందుకు సాగుదామని పిలుపిచ్చారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వం  తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు రైతులకు వరం అని వీర్రాజు కొనియాడారు. స్వామినాధన్ సిఫార్సులను ఈ బిల్లు ద్వారా అమలు చేయవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతు తాను పండించిన పంట అమ్ముకునే అవకాశాన్ని మోదీ కల్పించారని చెప్పారు. సినిమాల్లో చూసిన రైతు స్వేచ్ఛకు మోదీ నిజంగా చట్ట బద్దత కల్పించి చూపారని ప్రశంసించారు. గతంలో కంటే రైతుకు  గిట్టుబాటు ధర కూడా రెట్టింపు వస్తుందని భయోరసా వ్యక్తం చేశారు.