ఐక్య‌రాజ్య‌స‌మితిలో సంస్కరణలకు ప్రధాని పిలుపు 

ఐక్య‌రాజ్య‌స‌మితిలో సంస్కరణల అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. ఐక్య‌రాజ్య‌స‌మితికి 75 ఏళ్లు నిండిన నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ వీడియో రికార్డు ద్వారా త‌న సందేశం అందిస్తూ  కాలం చెల్లిన విధానాల‌తో నేటి త‌రం స‌వాళ్ల‌ను  ఎదుర్కోలేమ‌న్నారు. స‌మ‌గ్ర‌మైన సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్ట‌లేక‌పోతే.. యూఎన్‌లో విశ్వాస సంక్షోభ ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు హెచ్చరించారు. 
ఘ‌ర్ష‌ణ‌ల‌ను నిలువ‌రించ‌డం, వాతావ‌ర‌ణ మార్పులు, అభివృద్ధి, డిజిట‌ల్ టెక్నాల‌జీ లాంటి అంశాల‌పై యూఎన్ దృష్టి పెట్టాల‌ని ప్రధాని సూచించారు. ఐక్య‌రాజ్య‌స‌మితిపై ప్ర‌శంస‌లు కురిపించిన ప్ర‌ధాని ఆ సంస్థ స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కొన్న‌ట్లు చెప్పారు.  యూఎన్‌లో విశ్వాస సంక్షోభం ఏర్ప‌డిన‌ట్లు తెలిపారు.
కోవిడ్ నేప‌థ్యంలో ప్ర‌పంచాధినేత‌లు న్యూయార్క్‌లో జ‌ర‌గాల్సిన కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాలేక‌పోయారు.  దీంతో కొంద‌రు నేత‌లు వీడియో సందేశాల‌ను పంపారు.  యూఎన్ వ‌ల్లే ఈ ప్ర‌పంచం ఉత్త‌మంగా ఉంద‌ని చెబుతూ యూఎన్ ప‌తాకం కింద ప‌నిచేసిన యూఎన్ పీస్‌కీప‌ర్ల‌ను ఆయ‌న మెచ్చుకున్నారు.  పీస్‌కీపింగ్‌లో భార‌త పాత్ర‌ను కూడా ఆయ‌న గుర్తు చేశారు.  శ‌నివారం రోజున జ‌న‌ర‌ల్ డిబేట్ సంద‌ర్భంగా కూడా ప్ర‌ధాని మోదీ మ‌రోసారి త‌న సందేశం వినిపించ‌నున్నారు.
 
ఇలా ఉండగా, ఇటీవ‌ల తాము తీసుకొచ్చిన ‘నూత‌న జాతీయ విద్యావిధానం-2020’ భార‌త‌దేశాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలో విద్య‌కు గ‌మ్య‌స్థానంగా నిల‌బెడుతుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేర్కొన్నారు. ఈ ఉద‌యం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఐఐటీ-గువాహ‌టి కాన్వ‌కేష‌న్‌లో పాల్గొన్న ప్ర‌ధాని దేశంలోని ప్ర‌తిష్టాత్మ‌క విద్యాసంస్థ‌లు విదేశాల్లో త‌మ క్యాంప‌స్‌ల‌ను ఏర్పాటు చేసుకునేలా ప్ర‌భుత్వం ప్రోత్సాహం అందించ‌నున్న‌ద‌ని తెలిపారు. 
 
మ‌న విద్యావిధానం స‌రిహ‌ద్దులు దాటి విస్త‌రించాల‌నే భార‌త‌దేశ ల‌క్ష్యాన్ని నెర‌వేర్చ‌డంలో ఐఐటీ గువాహ‌టి కీల‌కపాత్ర పోషించాల‌ని కోరారు. ‘నేడు మీలాంటి యువ‌త మెద‌ళ్ల‌లో మెదులుతున్న‌ ఆలోచ‌న‌లే రేప‌టి భార‌త‌దేశ‌పు భ‌విష్య‌త్తు’ అని ఐఐటీ గువాహ‌టి విద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని పేర్కొన్నారు. ‘మీ భవిష్య‌త్తు కోసం మీరు కంటున్న క‌ల‌లే నిజ‌మైన భార‌త‌దేశానికి రూపాన్ని ఇస్తాయ‌ని’ ఆయ‌న పేర్కొన్నారు.