పంటల కనీస మద్దతు ధరల పెంపు  

పార్లమెంట్ ఉభయ సభల్లో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత   కొన్ని పంటల కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. మద్దతు ధర పెరగనున్న పంటల జాబితాలో బార్లీ, గోధుమ, ఆవాలు, కుసుమ తదితరాలు ఉన్నాయి.

పంజాబ్, హర్యానా రైతులు తీవ్ర నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ప్రధాన పంట అయిన గోధుమ కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.50 పెంచింది. దీంతో దీని ధర క్వింటాల్‌కు రూ.1975కు చేరింది.

ఆ ప్రాంతంలోనే మరో పెద్ద పంట అయిన ఆవాలు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.225 పెంచడంతో ఇది రూ.4,650కి పెరిగింది. పప్పులు, త్రుణ ధాన్యాల కనీక మద్దతు ధరలు క్వింటాల్‌కు రూ.225, రూ.300 మేర పెరిగి రూ.5,100కి చేరాయి. అట్లాగే శనగపప్పుకు రూ 225, ఎర్రపపుకు రూ 300, బార్లీకి రూ 75, కుసుమకు రూ 112 చొప్పున పెంచారు.

ప్రధాని నరేంద్ర  మోదీ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా రబీ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వం  వెల్లడించింది. గత ఏడాది కంటే ఒక నెల ముందుగా రబీ పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం ప్రకటించడం గమనార్హం.