వీడియో కాన్ఫరెన్సు ద్వారా అసెంబ్లీకి ఎమ్మెల్యేలు

కరోనా సంక్షోభ సమయంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల ఒకరోజు సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొట్టమొదటిసారి పలువురు ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్సు ద్వారా అసెంబ్లీ సమావేశానికి హాజరు అయ్యారు. 
 
ఒకరోజు అసెంబ్లీ సమావేశానికి ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్ చౌహన్, మంత్రులు, ప్రతిపక్షనాయకుడితోపాటు 57 మంది మాత్రమే హాజరుఅయ్యారని అసెంబ్లీ సచివాలయం వెల్లడించింది. 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 202 మంది సభ్యులే ఉన్నారు. 28 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీనికితోడు పలువురు ఎమ్మెల్యేలు కరోనాతో ఆసుపత్రి పాలయ్యారు.  
 
 అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ లాల్జీటాండన్, సభ్యులు మనోహర్, గోవర్ధన్ లు మరో 15 మంది మాజీ సభ్యులు, మాజీ సీఎం అజిత్ జోగి, కేంద్రమాజీ మంత్రి హంసరాజ్ భరద్వాజ్ లకు సంతాపం తెలిపారు. 
 
వీరితోపాటు గాల్వాన్ లోయలో మృతులైన అమర జవాన్లుకు శ్రద్ధాంజలి ఘటించారు. మరికొందరు ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొనేలా ఏర్పాట్లు చేశామని అసెంబ్లీ సచివాలయ అధికారులు చెప్పారు. 
ఒకరోజు సమావేశంలో బడ్జెట్, ఆర్డినెన్సులు, ఇతర ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెడతామని మంత్రి చెప్పారు.ఈ అసంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయం, జీరోఅవర్ లను రద్దు చేశారు. ప్రశ్నలడిగిన సభ్యులకు రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించారు.
కరోనా దృష్ట్యా మధ్య ప్రదేశ్ అసెంబ్లీని శానిటైజ్ చేశారు. వాహనాలు, డ్రైవర్లను అసెంబ్లీ బయట నిలిపివేయాలని నిర్ణయించారు.

.