రాజ్యసభలో రసభ… వ్యవసాయ బిల్లుల ఆమోదం 

రాజ్యసభలో ప్రజాస్వామ్యం పరాభవానికి గురైనది. కీలకమైన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించే ప్రతిపక్షాలు వాటిని ఓడించే సంఖ్యా బలం లేకపోవడంతో రసభ సృష్టించి సభాకార్యక్రమాలను అడ్డుకోవాలని విఫల ప్రయత్నం చేశాయి. కాంగ్రెస్ వాక్ అవుట్ చేస్తున్నట్లు ప్రకటించి, ఇతర ప్రతిపక్షాలను రెచ్చగొట్టింది.
దానితో ప్రతిపక్ష సభ్యులు అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హ‌రివ‌న్ష్ వైపు తోసుకు వచ్చారు. ఆయనపైకి పేపర్లు విసిరి కొట్టారు. డిప్యూటీ చైర్మన్‌ మైక్‌ను కూడా లాక్కునేందుకు యత్నించారు. ఈ గందరగోళం మధ్యనే బిల్లులకు ఆమోదం లభించింది. 
రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ బిల్లులపై చర్చ సందర్భంగా హామీ ఇచ్చారు. వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని  మంత్రి భరోసా ఇచ్చారు.  

ఈ బిల్లులను వైసీపీ, బీజేడీలు మినహా ఇతర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆకాలీదళ్, ఆప్, టీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్ద నిలబడి ఆందోళనకు దిగారు.

డిప్యూటీ చైర్మ‌న్ బిల్లుల‌ను ఆమోదింప చేసేందుకు వాయిస్ ఓటుకు మొగ్గుచూపారు.ఆ ద‌శ‌లో టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్డిప్యూటీ చైర్మ‌న్ చైర్ వైపు దూసుకువెళ్లారు. త‌న చేతిలో ఉన్న రూల్ బుక్‌ను చైర్ వైపు చూపించే ప్ర‌య‌త్నం చేశారు. డిప్యూటీ చైర్మ‌న్ డెస్క్ వైపు కొంద‌రు ఎంపీలు దూసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. వారిని మార్ష‌ల్స్ అడ్డుకున్నారు.

డిప్యూటీ చైర్మ‌న్ డెస్క్‌పై ఉన్న మైక్‌ల‌ను కూడా కొంద‌రు ఎంపీలు లాగేసే ప్ర‌య‌త్నం చేశారు. వారి చేతుల్ని మార్ష‌ల్స్ డెస్క్ మీద నుంచి తొల‌గించారు.  విప‌క్ష స‌భ్యులు బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ నినాదాలు చేశారు. కొంత స‌మ‌యం మైక్‌ను ఆపేసి కూడా స‌భ నిర్వ‌హించారు.  స‌భ్యుల నినాదాల మ‌ధ్య‌నే డిప్యూటీ చైర్మ‌న్ ప‌లు విష‌యాల‌ను మాట్లాడారు.

తీవ్ర గంద‌ర‌గోళం మ‌ధ్య స‌భ‌ను మ‌ధ్యాహ్నం 1.41 నిమిషాల వ‌ర‌కు వాయిదా వేశారు. వాయిదా త‌ర్వాత స‌మావేశ‌మైన రాజ్య‌స‌భ‌లో మ‌ళ్లీ నిర‌స‌న‌లు హోరెత్తాయి. అయినా డిప్యూటీ చైర్మ‌న్ వాయిస్ ఓటు ద్వారా మూడు వ్యవసాయ బిల్లుల‌ను పాస్ చేశారు. పంట‌కు ఎంఎస్‌పీ కొన‌సాగుతుంద‌ని మంత్రి తోమ‌ర్ ఈ సందర్భంగా స్ప‌ష్టం చేశారు. మూడు బిల్లులు ఇప్ప‌టికే లోక్‌స‌భ‌లో పాస‌య్యాయి.

కాగా, ప‌్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌జాస్వామ్యాన్ని కూనీచేశాయ‌ని పార్లమెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి మండిప‌డ్డారు. ఆదివారం రాజ్య‌స‌భ‌లో వ్య‌వ‌సాయ బిల్లుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు వ్య‌వ‌హ‌రించిన తీరు చాలా దారుణంగా ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 
రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల వైఖ‌రిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని చెప్పారు. కాంగ్రెస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్ స‌భ్యులు తమ‌ను తాము న‌వాబులుగా ఊహించుకుంటున్నార‌ని జోషి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్ర‌భుత్వంగానీ, అధికార పార్టీగానీ ఇక‌పై ఇలాంటి వాటిని స‌హించ‌బోద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.