యుపిలో ఆరు నెలల్లో 3 లక్షల ఉద్యోగాల భర్తీ 

వచ్చే ఆరు నెలల్లో 3 లక్షల ఉద్యోగ నియామాకాలు పూర్తి చేయాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలిచ్చారు. ఈ అంశంపై త్వరలో యూపీఎస్‌సీ (ఉత్తర్‌ ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌) నియామక సంస్థలతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమావేశం కానున్నట్లు అధికారులు తెలిపారు.

రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. 6 నెలల్లో ఉద్యోగాలు పొందిన వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో యోగి ఆధిత్యనాథ్‌ ఉద్యోగ నియామకాలపై ఈ  కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ నియామకాలలో ఎలాంటి అవినీతికి అవకాశం ఇవ్వొద్దని పారదర్శకంగా పరీక్షలను నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు యూపీ ప్రభుత్వం లక్షా 37వేల పోలీస్‌ నియామకాలు, 50 వేల టీచర్‌ ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖలలో లక్షకు పైగా నియామకాలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.