పాక్‌లో మైనార్టీల ఊచకోత

పాకిస్థాన్ ఆ దేశంలోని మతపరమైన మైనార్టీలను వేధిస్తూ వారి ప్రాణాలతో ఆటాడుకొంటోందని భారతదేశం నిరసన వ్యక్తం చేసింది. హిందువులు, సిక్కులు ఇతరత్రా మైనార్టీలు ఆ దేశంలో దిక్కుతోచని స్థితిలోగడపాల్సి వస్తోందని మానవ హక్కుల మండలి (హెచ్‌ఆర్‌సి) 45వ సదస్సులో భారత ప్రతినిధి బృందం తమ వాదన విన్పించింది. 

ఉగ్రవాదపు పుట్టిల్లుగా మారిన పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని సాగిస్తోంది. మరో వైపు దేశంలో మతపరమైన మైనార్టీలను అధికారపు వ్యవస్థ ద్వారా అనేక విధాలుగా వేధిస్తోంది. అటువంటి దేశానికి మానవ హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడే హక్కు లేనేలేదని భారత ప్రతినిధి విమర్శించారు.

ఇటీవల హెచ్‌ఆర్‌సి వేదికగా భారత్‌పై పాకిస్థాన్ చేసిన విమర్శలను తగు విధంగా తిప్పికొట్టే హక్కు తమకు ఉందని, తమ వివరణ కేవలం ఊకదంపుడు విద్వేషపూరితం కాకుండా వాస్తవికత ప్రాతిపదికన ఉంటుందని భారత ప్రతినిధి స్పష్టం చేశారు.

తరచూ కట్టుకథలతో, స్వార్థపూరిత ఉద్ధేశాలతో అంతర్జాతీయ వేదికల నుంచి భారత్‌పై బురదచల్లడం పాకిస్థాన్‌కు ఓ అలవాటుగా మారిందని ఇటువంటి వాటిని అంతర్జాతీయ సమాజం సహించరాదని భారత్ పిలుపు నిచ్చింది. ఉగ్రవాదానికి ఆలవాలం అయిన దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం అని పేర్కొంది.