ఈ ఏడాది జ‌మ్ముక‌శ్మీర్‌లో 177 మంది ఉగ్ర‌వాదుల హ‌తం

జ‌మ్ముక‌శ్మీర్ కేంద్ర‌పాలిత ప్రాంతంగా మారిన త‌ర్వాత అక్క‌డ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌పై భ‌ద్ర‌త ద‌ళాలు, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్ర‌తి రోజు ఏదో ఒకప్రాంతంలో ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుపెడుతున్నారు. 

ఈ క్ర‌మంలో జ‌మ్ముక‌శ్మీర్‌లో ఈఏడాది ఆరంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 177 మంది ముష్క‌రును అంత‌మొందించామ‌ని జ‌మ్ముక‌శ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ప్ర‌క‌టించారు. గ‌త ఎనిమిది నెల‌ల్లో ఒక్క శ్రీన‌గ‌ర్ ప్రాంతంలో నిర్వ‌హించిన ఏడు ఆప‌రేష‌న్ల‌లో 16 మంది ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యార‌ని చెప్పారు. 

అదేవిధంగా ఈ ఏడాది రాష్ట్ర‌వ్యాప్తంగా 72 ఆప‌రేష‌న్లు నిర్వ‌హించామని చెప్పారు. ఈరోజు ఉద‌యం శ్రీన‌గ‌ర్‌లోని బాతామలూ ప్రాంతంలో ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌ట్టుబెట్టాయి. 

శ్రీనగర్‌లో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. శ్రీనగర్‌లోని బటమలూ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఫిర్దౌసాబాద్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ కూంబింగ్ నిర్వహించింది.

 ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా ఆర్మీ కూడా ఎదురుకాల్పులకు దిగింది. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కూంబింగ్ కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందగా,  కౌన్సర్ రియాజ్ అనే మహిళ కూడా మృతి చెందింది. 

కాగా.. ఈ కాల్పుల్లో ఇద్దరు సిఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చామని, కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వారు తెలిపారు.