ఎలక్ట్రానిక్‌ మీడియాను నియంత్రించాలి    

టీఆర్పీల కోసం చాలా వరకు చానళ్లు ‘సెన్సేషనలిజం’ బాట పడుతున్నాయని, దేశంలో ఎలక్ట్రానిక్‌ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే మీడియా స్వేచ్ఛ ముఖ్యమని, ప్రెస్‌ను నియంత్రించడం ప్రజాస్వామ్యానికి హానికరమని కేంద్రం వాదించింది.

తాము మీడియాపై సెన్సార్‌ విధించాలని చెప్పడం లేదని, ఒక విధమైన స్వీయ నియంత్రణ ఉండాలని చెబుతున్నామని కోర్టు స్పష్టంచేసింది. మీడియాకు స్వీయ నియంత్రణలు రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది.

సుదర్శన్‌ టీవీ ‘బిందాస్‌ బోల్‌’ ప్రోగ్రామ్‌పై దాఖలైన పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. సివిల్‌ సర్వీసుల్లోకి ముస్లింలు చొరబడుతున్నారంటూ రూపొందించిన ఈ కార్యక్రమంపై కోర్టు స్టే విధించింది. ఈ ప్రోగ్రామ్‌ ముస్లిం వర్గానికి అపకీర్తి కలిగించే విధంగా ఉన్నదని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పేర్కొంది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ ‘మీడియాపై ప్రభుత్వం నియంత్రణలు విధించాలని మేం చెప్పడం లేదు. భావప్రకటనా స్వేచ్ఛకు ఇది శాపంగా మారుతుంది. అయితే మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలి’ అని పేర్కొంది. పలు మీడియా హౌజ్‌లు సమాంతరంగా చేపడుతున్న ‘క్రిమినల్‌ ఇన్వేస్టిగేషన్‌’ను కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.