వేదాద్రిలో ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టి పడాలి

ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సూచించారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుండా, తొట్రుపాటు లేకుండా, సాంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని ఆదేశించారు. 

స్వామివారికి వివిధ రకాల సేవలు, పూజలు చేసే విషయంలో, భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని సిఎం చెప్పారు. ఆలయ నిర్మాణ పనులు అత్యంత సుందరంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం యాదాద్రి ఆలయానికి చేరుకున్న సిఎం కెసిఆర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

దాదాపు 6 గంటలపాటు యాదాద్రి అంతా కలియ తిరిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యాద్రాద్రి ఆలయానికి రింగు రోడ్డు సుందరీకరణ ఒక మణిహారంలా తీర్చిదిద్దాలని సూచించారు. పచ్చని చెట్లు, వీధి దీపాలతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లతో రింగ్ రోడ్డును అత్యంత సుందరంగా తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.

ఎంతమంది భక్తులు వచ్చినా వారికి సౌకర్యాలు కల్పించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా అన్ని నిర్మాణాలు ఉండాలని సిఎం స్పష్టం చేశారు. ఆలయానికి ఆనుకుని ఉన్న గండి చెరువును ప్రతి రెండు నెలలకు ఒకసారి కాళేశ్వరం జలాలతో నింపాలని ఆయన ఆదేశించారు.

ఆలయం పరిసరాలు, టెంపుల్ సిటీ నిర్మాణం అద్భుతమైన పచ్చదనంతో నిండి ఉండాలని, ఇందుకోసం చెట్లను ఎక్కువగా పెంచాలని కేసీఆర్ పేర్కొన్నారు. స్పెషల్ ఆర్కిటెక్ట్‌లను పిలిపించి గండి చెరువు ప్రాంతాన్ని అందమైన స్పాట్ గా తీర్చిదిద్దాలని సిఎం కోరారు. యాదాద్రి టెంపుల్ సిటీలో 365 క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. మరో 200 ఎకరాల్లో కాటేజీల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల కో సం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఫోన్లో ఆదేశించారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు యా దాద్రి ప్రసిద్ధి అని, ఒకేసారి నాలుగు వేల మంది వ్రతం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సిఎం చెప్పారు. 5 వేల కార్లు, 10 వేల బైకుల కోసం పార్కింగ్‌ను సిద్ధం చేయాలని పేర్కొన్నారు.