ఢిల్లీ అల్లర్ల కేసులో సీతారాం ఏచూరి, యోగేంద్ర యాదవ్ 

50 మందికి పైగా చనిపోవడానికి కారణమైన ఢిల్లీ అల్లర్ల కేసులో చార్జి షీట్ దాఖలు చేసిన పోలీసులు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్థికవేత్త  జయతి ఘోష్, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ లను సహా కుట్రదారులుగా పేర్కొన్నారు. 

సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్రం చేయాలని ప్రదర్శనకారులను వీరు కోరినట్లు చార్జిషీట్‌లో తెలిపారు. సీఏఏ, ఎన్ఆర్సీలు ముస్లిం వ్యతిరేకమంటూ సమాజంలో అసంతృప్తిని వ్యాప్తి చేయడం, కేంద్రాన్ని కించపరిచేలా ప్రదర్శనలు చేయాలని చెప్పడం లాంటి ఆరోపణలు వీరు ఎదుర్కొంటున్నారు.

హింస తొలుత జాఫ్రాబాద్‌లో మొదలైంది. తర్వాత ఢిల్లీ అంతా పాకింది. జాఫ్రాబాద్ హింస కేసులో జేఎన్‌యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్; జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

వీరి వాంగ్మూలం ఆధారంగా ఏచూరి తదితరులను పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్, మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నేతల పేర్లనూ ఫాతిమా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది.