చర్యలు తీసుకోమంటే ప్రభుత్వాన్ని అస్థిర పరచడమా?

అంతర్వేది సంఘటనపై పోలీసులు చెప్పే కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ధ్వజమెత్తుతూ దుశ్చర్యలకు కారకులపై చర్యలు కోరుతుంటే తమను అస్థిరపరచే పనులు అంటూ ప్రభుత్వం అర్థం లేని వాదన చేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
 
కరోనా విపత్తు ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రజలు తమ నిరసనలు తెలియజేసేందుకు రోడ్ల మీదకు వస్తున్నారని గుర్తు చేస్తూ వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెపారు. వారి మనోభావాలు ఏ విధంగా దెబ్బ తిన్నాయో ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. 
 
హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ధర్మ పరిరక్షణ దీక్షను చేబడుతూ  అంతర్వేది రథం దగ్ధంపై పోలీసులు నమ్మశక్యం కానీ కారణాలు చెబుతున్నారని పవన్‌కల్యాణ్ విమర్శించారు.ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వ నిర్లిప్తత, కాలయాపనతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. 
 
వైసీపీ ప్రభుత్వం పిఠాపురంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలోనే అసలు దోషులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావని తెలిపారు. మతిస్థిమితం లేనివారి చర్య అని ఉదాసీనంగా తేల్చేయడం వల్లే వరుస ఘటనలు చోటు చేసుకొంటున్నాయని చెప్పారు. 
ప్రభుత్వంలో బాధ్యత కలిగినవాళ్ళు ఇందుకు భిన్నంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని అర్థం లేని వాదన వినిపిస్తున్నారని దుయ్యబట్టారు. 151 మంది ఉన్నారు కదా… మిమ్మల్ని ఎవరు అస్థిరతకు గురిచేస్తారని ప్రశ్నించారు.
వరుసగా చోటుచేసుకొంటున్న ఈ ఘటనలపై బలమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.  భక్తుల మనోభావాలు కాపాడండి అంటూ ఒక భావోద్వేగంతో బయటకు వచ్చారని చెప్పారు.
‘మా మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ శుక్రవారం ‘ఛలో అంతర్వేది’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందుకు జనసేన పార్టీ మద్దతు తెలియచేస్తుంది. పార్టీ నాయకులు, శ్రేణులను, వీర మహిళలను కోరుతున్నది ఒక్కటే. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనాలి. మీ మనసులు గాయపడ్డాయి… ఎక్కడా భావోద్వేగాలకు లోను కావద్దు. ప్రజాస్వామ్యంలో మీ నిరసన తెలియచేసే హక్కు ఉంది’ అని పవన్‌కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.