అక్షరాస్యతలో అట్టడుగున తెలుగు రాష్ట్రాలు 

అక్షరాస్యతలో ఎప్పటిలాగానే కేరళ  96.2 శాతం అక్షరాస్యతతో దేశంలోనే మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగు స్థానంలో నిలవగా, తెలంగాణ కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. 

‘హౌస్‌హోల్డ్‌ సోషల్‌ కన్సంప్షన్‌: ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా’ అనే అంశంపై నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ ‘జాతీయ నమూనా సర్వే’ నిర్వహించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏడేళ్ల వయసు దాటిన వారిలో అక్షరాస్యత రేటుపై ఆ సర్వే ఆధారంగా ఒక నివేదికను సమర్పించింది. 

దాని ప్రకారం  దేశంలో అక్షరాస్యత రేటు 77.7%. గ్రామీణ ప్రాంతాల్లో 73.5% ఉండగా పట్టణప్రాంతాల్లో 87.7% ఉండడం గమనార్హం. అక్షరాస్యత రేటులో కేరళ అగ్రస్థానంలో నిలవగా 88.7 శాతం అక్షరాస్యతో ఢిల్లీ రెండోస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరాఖండ్‌ (87.6%), హిమాచల్‌ప్రదేశ్‌(86.6%), అసోం (85.9%) ఉన్నాయి.

స్త్రీ, పురుషుల్లో అక్షరాస్యత విషయానికి వస్తే పురుషుల్లో అది 84.7 శాతంగా ఉండగా, మహిళల్లో 70.3 శాతం. ఇది జాతీయ సగటు. రాష్ట్రాలవారీగా చూసుకున్నా  అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కేరళలో అత్యధికంగా పురుషుల అక్షరాస్యత రేటు 97.4% ఉండగా.. స్త్రీలలో 95.2 శాతం ఉంది. ఏపీలో పురుషుల అక్షరాస్యత రేటు 73.4% ఉండగా, మహిళల్లో 59.5% ఉంది.

2017 జూలై నుంచి 2018 జూన్‌ నడుమ దేశవ్యాప్తంగా 8097 గ్రామాల్లో 64,519 మందిని, పట్టణప్రాంతాల్లో 49,238 మందిని ప్రశ్నించి ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న గ్రామీణప్రాంతాలవారిలో 4 శాతం మంది ఇళ్లల్లో, పట్టణప్రాంతాల వారిలో 23 శాతం మంది ఇళ్లల్లో కంప్యూటర్లు ఉన్నట్టు తేలింది.