హైపర్‌సోనిక్ టెక్నాలజీ ప్రదర్శించిన భారత్ 

భవిష్యత్తులో దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలు, వైమానిక ప్లాట్‌ఫామ్‌లకు శక్తినిచ్చే దేశీయంగా అభివృద్ధి చేసిన హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ వెహికిల్ (హెచ్‌ఎస్‌టిడివి)ని సోమవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. 

హైపర్‌సోనిక్ ప్రొపల్షన్ సాంకేతికతల ఆధారంగా హెచ్‌ఎస్‌టిడివి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) దీన్ని అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలియజేశారు. సోమవారం ఉదయం 11గంటల 3నిమిషాలకు అగ్ని క్షిపణి బూస్టర్‌ను ఉపయోగించి ఈ హెచ్‌ఎస్‌టిడివిని ప్రయోగించారు. 

హెచ్‌ఎస్‌టిడివిని విజయవంతంగా ప్రయోగించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలను అభినందించారు. దీనిని ఓ మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్‌ను సాకారం చేసే క్రమంలో ఈ మైలురాయిని సాధించినందుకు డిఆర్‌డిఓను అభినందిస్తున్నట్లు రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

ఈ ప్రయోగంతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలతో మాట్లాడానని, ఈ గొప్ప విజయానికి అభినందించానని చెప్పారు. వారిని చూసి దేశం గర్విస్తోందన్నారు. హెచ్‌ఎస్‌టిడివి పరీక్ష విజయవంతం కావడంతో దేవీయ రక్షణ పరిశ్రమ తో కలిసి తర్వాతి తరం సూపర్‌సోనిక్ వెహికిల్స్ నిర్మాణంలో ఉపయోగపడే అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం భారత్ తన సామర్థాన్ని ప్రదర్శించిందని డిఆర్‌డిఓ అధికారి ఒకరు చెప్పారు.

ఏదయినా ఒక ఆయుధం శబ్దవేగానికన్నా అయిదు రెట్లు వేగంగా ప్రయాణిస్తే దాన్ని హైపర్‌సోనిక్ ఆయుధంగాపేర్కొంటారు. అంటే మాక్ 5 స్పీడ్ అన్న మాట. ఈ హైపర్‌సోనిక్ ఆయుధాల్లో బాలిస్టిక్ క్షిపణుల్లో ఉండే వేగం, క్రూయిజ్ క్షిపణుల్లో వలె మార్గాన్ని మార్చుకునే లక్షణాలు ఉంటాయి. అందుకే దీన్ని అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా భావిస్తారు. 

వీటిలో అత్యంత శక్తివంతమైన స్క్రామ్‌జెట్ ఇంజన్లను వాడడం వల్ల అత్యం త వేగాన్ని అందుకుంటాయి. ఈ ఇంజిన్లు వా తావరణంలోని ఆక్సిజన్‌ను పీల్చుకుని వాటిలో ఉన్న హైడ్రోజన్‌తో కలిపి శక్తిని సృష్టిస్తాయి.

దీని సాయంతో అవి మాక్ 5 స్పాడ్‌ను అందుకుంటాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ టెక్నాలజీని సొంతం చేసుకున్నాయి. సోమవారం పరీక్షతో భారత్ ఇప్పడు దాన్ని సొంతం చేసుకున్న నాలుగో దేశం అయింది.