కరోనా బాధితులకు డెంగ్యూ, మలేరియా ముప్పు

శ్వాస సంబంధ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారిపై కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉంటుందని ఇప్పటికే వైద్యులు, నిపుణులు, డబ్ల్యుహెచ్‌ఒ సైతం వెల్లడించింది. అయితే కరోనా ఒకసారి సోకితే మళ్లీ సోకుతుందా? సోకదా? సోకితే ఏమైనా ప్రమాదమా? అనే అంశాలపై నిపుణుల నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో కరోనా బాధితులకు మరో సమస్య వచ్చి పడింది.

కరోనా రోగులకు డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులు సోకుతున్నట్లు ఢిల్లీ వైద్యులు గుర్తించారు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన వారికి కరోనాతో పాటు సీజనల్‌ వ్యాదుల లక్షణాలు కనపడటంతో వారికి పరీక్షలు నిర్వహించగా చాలా మందికి మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్‌ వ్యాధులు ఉన్నట్లు నిర్ధారించారు. 

‘ఢిల్లీలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో 30 ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో చేరాడు. విపరీతమైన జ్వరం రావడంతో పరీక్షలు చేయగా డెంగ్యూ నిర్ధారణ అయింది. అలాంటి లక్షణాలే ఉన్న మరో 16 ఏళ్ల యువకుడికి పరీక్ష చేయగా మలేరియా పాజిటివ్‌ వచ్చింది. ఇలా ఒక వ్యక్తిలో రెండు వ్యాధులు నిర్ధారణ కావడంతో చికిత్స అందించేందుకు వైద్యులు సతమతమవుతున్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నాం’ అని ఢిల్లీ ఎయిమ్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ప్రగ్యాన్‌ ఆచార్య తెలిపారు.