నెలలో రూ.100 కోట్ల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల అమ్మకం 

భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులు.. వ్యాక్సిన్లకు ఎనలేని డిమాండ్‌ను తెచ్చిపెట్టాయి. రెండు నెలల క్రితం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ వ్యాక్సిన్ల అమ్మకాలు ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు అమ్ముడయ్యాయని పారిశ్రామిక వర్గాలు వెల్లడించాయి.
దేశ చరిత్రలో కేవలం నెల రోజుల్లో ఈ స్థాయి విక్రయాలు జరుగడం ఇదే తొలిసారి.  ఈ వ్యాక్సిన్‌ను ఐదు సంస్థలు మాత్రమే మార్కెట్లోకి విడుదల చేశాయి. మిగతా కొన్ని సంస్థలు ట్రయల్‌ రన్‌లో ఉన్నాయి. ఫార్మా హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌లోనే అత్యధికం తయారవుతుండటం విశేషం.
ఈ వైరస్‌ సోకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మాత్రమే ఈ ఇంజెక్షన్లను ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో రోగికి ఆరు ఇంజెక్షన్లు వేస్తున్నారు. ఇంజెక్షన్‌ను ఆయా సంస్థలు ఒక్కో ధరతో అందుబాటులోకి తీసుకొచ్చాయి. నేరుగా మార్కెట్లోకి విడుదల చేయకపోయినప్పటికీ ఆయా సంస్థలు ప్రభుత్వానికి, ప్రైవేట్‌ ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నాయి.
భారత్‌లో గడిచిన రెండు నెలల్లో 20 లక్షల డోస్‌లు అమ్ముడయ్యాయని పారిశ్రామిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.  వచ్చే మూడు నెలల వరకు ఈ వ్యాక్సిన్లకు డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది ప్రారంభం నుంచి డిమాండ్‌ పడిపోయే అవకాశాలున్నాయి.
ఈ ఇంజెక్షన్లు వాడిన వారిలో 70-80 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో నెలకు 10-15 లక్షల వ్యాక్సిన్లు అవసరమవుతుండగా, సరఫరా మాత్రం 10 లక్షలే. రోజుకు 60 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. నెలకు ఇంచుమించుగా 20 లక్షలు. అయితే వీరిలో 2-3 లక్షల మందిలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వారికే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను ఇస్తున్నారు.
వచ్చే మూడేండ్ల కాలంలో దేశంలో 6 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఉంటుందని అంతర్జాతీయ బ్రోకరేజీ శాన్‌పోర్డ్‌ సీ.బర్న్‌స్టెయిన్‌ అంచనా.  మన కరెన్సీలో ఇది రూ.40 వేల కోట్లపైనే. వీటిలో రోగ నిరోధక శక్తి ఔషధాల మార్కెట్‌ విలువ రూ.15 వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా.