ఉద్యోగ నియామకాలపై నిషేధం లేదు 

కొత్తగా ఉద్యోగ నియామకాలను చేపట్టవద్దని ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ వనరులపై ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో కేంద్ర మంత్రిత్వ శాఖలలో కొత్త పోస్టులను సృష్టించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ  స్పష్టం చేసింది. 
 
శనివారం జారీ చేసిన కొత్త సర్క్యులర్‌లో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామక ప్రక్రియ కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం నాటి సర్క్యులర్‌లో ‘మంత్రిత్వ శాఖలు / విభాగాలు, అటాచ్డ్ కార్యాలయాలు, సబార్డినేట్ కార్యాలయాలు, చట్టబద్దమైన సంస్థలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలలో ఖర్చుల శాఖ ఆమోదంతో మినహా కొత్త పోస్టుల సృష్టిపై నిషేధం’ అని పేర్కొన్నది. 
 
 ‘భారత ప్రభుత్వంలో పోస్టులను భర్తీ చేయడానికి ఎటువంటి పరిమితి, నిషేధం లేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామకాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా యథావిధిగా కొనసాగుతాయి’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కాగా, ‘సెప్టెంబర్ 04 నాటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ సర్క్యులర్ పోస్టుల సృష్టి కోసం అంతర్గత విధానంతో వ్యవహరిస్తుందని, నియామకాలను ఏ విధంగానూ ప్రభావితం చేయదు.. తగ్గించదు’ అని పేర్కొన్నది.
 
ఇలా ఉండగా, లక్షా 40 వేల 640 ఉద్యోగాలకు డిసెంబర్ 15 నుంచి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష(సిబిటి)లు నిర్వహించనున్నట్టు రైల్వేబోర్డు చైర్మన్ వినోద్‌కుమార్‌యాదవ్ తెలిపారు. 2 కోట్ల 42 లక్షలమంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. 
 
ఎన్‌టిపిసి కింద గార్డులు, ఆఫీస్ క్లర్క్‌లు, కమర్షియల్ క్లర్క్ ఉద్యోగాలు 35,208, మినిస్టీరియల్ కేటగిరీ కింద స్టెనోలు, తదితర ఉద్యోగాలు 1663, ట్రాక్ నిర్వహణ, పాయింట్‌మెన్ పోస్టులు 1,03,769 భర్తీ చేయనున్నారు.