చైనా వ్యవహర తీరుపై రాజ్‌నాథ్ తీవ్ర అభ్యంతరం   

సరిహద్దులో యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు చైనా సహకరించాలని   భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌  గట్టిగా డిమాండ్ చేశారు. సరిహద్దు విషయంలో చైనా వ్యవహర తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరయ్యేందుకు మాస్కో వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్‌ సదస్సు అనంతరం చైనా రక్షణ మంత్రి వీ ఫెంజీతో సమావేశమయ్యారు. 2గంటల 20 నిమిషాలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో సరిహద్దు ఉద్రిక్తతల అంశంపైనే ప్రధానంగా చర్చించారు. చైనా రక్షణ మంత్రి కోరడంతో ఈ సమావేశం జరిగింది.
 
దౌత్య, సైనిక మార్గాల ద్వారా చర్చలు ముందుకు సాగాలని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మేలో భారత్‌-చైనా సరిహద్దులో వివాదం తరువాత ఇరుదేశ రక్షణశాఖ మంత్రులు ముఖాముఖీగా సమావేశం కావడం ఇదే తొలిసారి కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.
సరిహద్దు వివాదంపై మూడు నెలలుగా లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల సమావేశాలు జరుగుతున్నా ఇంత వరకు ఎలాంటి ఫలితం కనిపించ లేదు. ఇటీవల పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడంతో భారత సైన్యం తిప్పికొట్టింది. దీంతో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.
 
 చైనా ఎత్తును చిత్తు చేస్తూ.. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను భారత సైన్యం తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఉత్తర తీరంలోని కీలకమైన ఫింగర్‌ 2, ఫింగర్ 3 ప్రాంతాల్లో బలగాలను మోహరించి చైనాపై ఒత్తిడి పెంచింది.