సింహాచలంలో ఓ బైట వ్యక్తి పెత్తనం

ఆలయానికి సంబంధంలేని వ్యక్తి రికార్డులను ఎలా పరిశీలిస్తారు? ఆయనకు దేవస్థానం నిధులు ఎందుకు ఖర్చు చేయాలి? దీనిపై వివరణ ఇవ్వండి’ అంటూ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఛైర్‌పర్సన్‌ సంచయితా గజపతిరాజుకు మొన్నటి వరకు ఈవోగా పని చేసిన భ్రమరాంబ లేఖ రాశారు.

ఈ నెల ఒకటిన ఆమె బదిలీ కాగా అందుకు రెండు రోజుల ముందు ఆమె `వ్రాసిన ఈ లేఖ బైట పడడంతో ఆలయ వ్యవహారాలపై మరోసారి రగడ రచ్చకెక్కింది.  ఈ లేఖను దేవాదాయశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకూ ఆమె పంపారు. దేవాలయ వ్యవహారాలలో ఓ బైట వ్యక్తి పెత్తనం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కార్తీక సుందరరాజన్‌ సింహాచలం కొండపై 2 ఏసీ గదులతో ఉండే అన్నపూర్ణ కాటేజీలో మే 30 నుంచి ఉంటున్నారు. నిత్యం ఆయనకు అల్పాహారం, భోజనం తదితరాలకు ఆలయ నిధులను వెచ్చిస్తున్నారు. ఛైర్‌పర్సన్‌ చెప్పారంటూ పరిపాలన, భూ విభాగాల రికార్డులను తెప్పించుకుని ఆయన పరిశీలిస్తున్నారు.

ఆలయ భూ పరిరక్షణ విభాగానికి ఉన్న వాహనాన్ని తనకు అవసరం ఉన్నప్పుడల్లా సుందరరాజన్‌ ఉపయోగించుకుంటున్నారు. వంట తదితర పనులకు అయిదుగురు సిబ్బందిని వినియోగిస్తున్నారు. 

 
ఛైర్‌పర్సన్‌ ఇంటికి, సుందరరాజన్‌ ఉండే అతిథి గృహంలో వంట చేసేందుకు కలిపి రెండు గ్యాస్‌ సిలిండర్లను ఆలయ ఏఈవో సమకూర్చారని భ్రమరాంబ పేర్కొన్నారు.

సింహాచలం ఆలయ కార్య నిర్వహణాధికారి (ఈవో)గా పనిచేసిన భ్రమరాంబ తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలంటూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు గత వారం లేఖ రాశారు. ఆ తర్వాత ఆలయ ఛైర్‌పర్సన్‌ను ఉద్దేశించి, సుందరరాజన్‌ విషయంపై ఈ లేఖ రాసినట్లు తెలిసింది.

ఎలాగూ ఆలయ విధుల నుంచి తప్పిస్తారనే భావనతో విషయాలన్నీ అందులో పేర్కొన్నట్లు చెబుతున్నారు.  ఛైర్‌పర్సన్‌ ఓఎస్డీగా సుందరరాజన్‌ను నియమించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన పాలకవర్గ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు.

అందులో ఆయనకు జీతం, వాహనం, ఇతర వసతులను సమకూర్చాలని పేర్కొన్నారు. దీనిపై తొలుత సభ్యులు అభ్యంతరం తెలిపినా తరువాత నిబంధనలు ఎలా ఉంటే అలా చేయాలని నిర్ణయించారు. 

 
నిబంధనల మేరకు బయటి వారిని ఇలా నియమించే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆలయ సిబ్బందిలో ఎవరినైనా ఛైర్‌పర్సన్‌కు సహాయంగా ఉండేందుకు సమకూరుస్తారని పేర్కొంటున్నారు.