నీట్, జేఈఈ పరీక్షలు యధాతథం  

నీట్, జేఈఈ పరీక్షలు యధాతథంగానే జరుగుతాయని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తీర్పునిచ్చింది. ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడం కుదరదని తేల్చిచెప్పింది. 

నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆరు రాష్ట్రాల మంత్రులు వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మంత్రులు ఈ రివ్యూ పిటిషన్ వేయగా, న్యాయమూర్తులు అశోక్ భూషణ్, బీఆర్ గవాయ్, కృష్ణమురారితో కూడిన సుప్రీం ధర్మాసనం రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

కాగా, ఇప్పటికే జేఈఈ మెయిన్స్-2020 పరీక్షలు సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యాయి. 6వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఈనెల 13న నీట్ పరీక్ష జరగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలు గత నెలలో ఆందోళన చేశాయి. 

అయితే ఆగస్టు 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకే కేంద్రం కట్టుబడి పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించడంతో ఎంట్రన్స్ పరీక్షలు కూడా మొదలయ్యాయి. జేఈఈకి 9 లక్షల మందికి పైగా రిజిస్టర్ చేయించుకున్నారు.