సౌర విద్యుత్ లో అదానీ నెంబర్ వన్  

సౌర విద్యుత్ ఉత్పత్తి ఆస్తులు అత్యధికంగా ఉన్న కంపెనీల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు రీసెర్చ్ కంపెనీ మెర్కోమ్ టాప్ 10 గ్లోబల్ సంస్థల ర్యాంకులు విడుదల చేసింది.

సోలార్ కంపెనీలు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆస్తులతో పాటు నిర్మాణంలో ఉన్న ఆస్తులు, గెలుచుకున్న ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకుంది. 2019 చివరి నాటికి అదానీ 12.32 గిగావాట్ల సోలార్ ప్లాంట్స్‌ను నిర్వహించింది.

జీసీఎల్ న్యూ ఎనర్జీ 7.1 గిగావాట్లతో రెండో స్థానంలో ఉంది. ఇది హాంగ్‌కాంగ్‌కు చెందిన లిస్టెడ్ ఇండిపెండెంట్ సోలార్ పవర్ ప్రొడ్యూసర్. ఆ తర్వాత టోక్యోకు చెందిన ఎస్బీ ఎనర్జీ 7 గిగావాట్లతో మూడో స్థానంలో ఉంది. టాప్ 10 కంపెనీలు కలిసి 33 గిగావాట్ల సోలార్ ప్లాంట్స్‌ను నిర్వహిస్తున్నాయి.

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు 28.7 గిగావాట్ల సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి. అదానీ గ్రీన్ 2015లో తొలి సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది. అయిదేళ్లలోనే ప్రపంచంలోనే టాప్ 1 స్థానానికి ఎదిగింది. 2025 నాటికి 25 గిగావాట్లను టార్గెట్‌గా పెట్టుకుంది అదానీ గ్రీన్ ఎనర్జీ. ప్రస్తుతం 14.62 గిగావాట్లతో ఉంది.

నిర్మాణంలో ఉన్న, పొందిన ప్రాజెక్టుల సామర్థ్యం కారణంగా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకింగ్‌లో ఉండటంతో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు బుధవారం  10 శాతం వరకు కూడా ఎగబాకగా, గురువారం 5 శాతం ఎగిసి రూ.571.30 వద్ద క్లోజ్ అయింది. గత మూడు సెషన్లలో 25 శాతం వరకు లాభపడింది.

దిలా ఉండగా, ముంబై విమానాశ్రయం చేజిక్కించుకోవడంతో విమానాశ్రయాల పోర్ట్ పోలియో మరింత విస్తరించడంతో పాటు గ్రూప్‌లోని బీటుబీ వ్యాపారానికి సరికొత్త అవకాశాలు సృష్టించనుందని గౌతమ్ అదానీ తెలిపారు. అదానీ గ్రూప్‌కు ఇప్పటికే 6 నాన్-మెట్రో విమానాశ్రయాల కాంట్రాక్టులు దక్కించుకుంది. 

లక్నో, జైపూర్, గౌహతి, అహ్మదాబాద్, తిరువనంతపురం, మంగళూరు పోర్టుల కాంట్రాక్టును దక్కించుకుంది. ఇప్పుడు ముంబై విమానాశ్రయంలో 74 శాతం వాటా ఉంది.