62శాతం కరోనా కేసులు ఐదు రాష్ట్రాల్లోనే  

దేశంలోని నమోదవుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లోనే 62శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. భారతదేశంలో ప్రతి మిలియన్‌కు 49 మరణాలు సంభవిస్తున్నాయని, ప్రపంచ సగటు 111శాతంగా ఉందని పేర్కొన్నారు. 

కొన్ని దేశాల్లో మిలియన్‌కు 500-600 వరకు మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు. అలాగే పాజిటివ్‌ కేసులు మిలియన్‌కు భారత్ లో 2,792 ఉండగా, ప్రపంచంలో 3,359గా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు 4.50కోట్లకుపైగా కొవిడ్‌ పరీక్షలు చేయగా ఒకే రోజు రికార్డు స్థాయిలో 11.72లక్షల పరీక్షలు చేసినట్లు వివరించారు. 

అత్యధికంగా కరోనా టెస్టులు చేసిన దేశం ప్రపంచంలో ఒక్క భారతదేశంఅని చెప్పారు.  బుధవారం ఒక్క రోజు అత్యధికంగా 68,584 మంది రోగులు కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ కేసుల సంఖ్య యాక్టివ్‌ కేసుల కంటే 3.5శాతం ఎక్కువగా ఉందని తెలిపారు.

తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలో 62శాతం కేసులు ఉండగా, యాక్టివ్‌ కేసులు 25శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయని చెప్పారు. దేశంలో మొత్తం కొవిడ్‌ మరణాల్లో ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో 70శాతం ఉన్నాయని కేంద్రం చెప్పింది. ప్రజలు తప్పనిసరిగా భద్రతా నియమాలను పాటించాలని రాజీవ్‌ భూషణ్‌ కోరారు.

కాగా, సింగిల్‌గా డ్రైవింగ్, సైక్లింగ్ లేదా లేదా వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ అవసరం లేదని తెలిపారు.  అయితే వాహనంలో లేదా వ్యాయామశాలలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం కరోనా నిబంధనల మేరకు తప్పకుండా మాస్కు ధరించాలని రాజేశ్ భూషణ్‌ స్పష్టం చేశారు.