పాక్ పన్నాగానికి భద్రతా మండలి చెక్!

ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఉద్దేశించిన 1267 స్పెషల్ ప్రోసీజర్‌ను పక్కదారిపట్టిస్తూ ఉగ్రవాదంకి మతం రంగు పులుముదామనుకున్న పాక్ ప్రయత్నాలను ఐక్యరాజ్య సమితి అడ్డుకుందని ఐక్యరాజ్యసమితిలోని భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి వెల్లడించాయిరు. పాక్ పన్నాగాన్ని వమ్ము చేసిన భద్రతా మండలి సభ్యులకు భారత్ తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు.
భారతీయులైన అంగార అప్పాజీ, గోవింద్ పట్నాయక్‌లను ఉగ్రవాదులుగా ప్రకటించాలంటూ పాక్ 1267 కమిటీ ముందుకు ఇటీవల ఓ ప్రతిపాదన తెచ్చింది. తద్వారా ఉగ్రవాదానికి మత రంగు పులిమే ప్రయత్నం చేసింది. అయితే పాక్ పన్నాగాన్ని ముందుగానే పసిగట్టిన భద్రతా మండలి ఆధారాలు చూపాలంటూ పాక్‌ను డిమాండ్ చేశారు. 

ఈ విషయంలో పాక్ విఫలమవడంతో భద్రతా మండలి సభ్యులైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించాయి.

‘ఉగ్రవాదానికి మతపరమైన కోణం జోడిస్తూ రాజకీయం చేసేందుకు పాక్ నిస్సిగ్గుగా చేసిన ప్రయత్నాలను భద్రతా మండలి చెక్ పెట్టింది. పాక్ పన్నాగాలను వమ్ము చేసిన సభ్య దేశాలకు మేము ధన్యావాదాలు చెబుతున్నాం’ అని టీఎస్ తిరుమూర్తి ట్వీట్ చేశారు.

కాగా.. కొద్ది కాలం క్రితం కూడా పాక్ ఇదే వ్యూహాన్ని అమలు చేయబోయి బోల్తాపడింది. అజయ్ మిస్త్రీ, వేణు మాధవ్ ఢోంగ్రా అనే ఇద్దరు వ్యక్తులపై భద్రతా మండలితో ఉగ్రవాద ముద్ర వేయించేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. అయితే నీచుడు వెనకటి గుణమేల మానురా అన్నట్టు పాక్ పాత పద్దతినే మళ్లీ ఫాలో అయి మరోసారి పరువు పోగొట్టుకుంది.