మరోమారు జగన్ కు సుప్రీం లో చుక్కెదురు  

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోమారు చుక్కెదురు అయ్యింది. గురువారం నాడు ఇంగ్లిష్‌ మీడియం అమలు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 

ఈ క్రమంలో ఎస్‌ఎల్‌పీ, స్టేపై ప్రతివాదులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన చట్టంలో లేదనిస్పష్టం చేశారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరగాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రగతిశీలమని పేర్కొన్నారు.  తెలుగు మీడియం విద్యా బోధన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం తీవ్రంగా తగ్గిపోతుందని సుప్రీంకోర్టుకు విశ్వనాథన్ తెలిపారు.

అయితే ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది శంకర్‌నారాయణ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకునే అవకాశాన్ని కాలరాస్తుందని సుప్రీంకోర్టుకు త్లెఇపారు. తెలుగు మీడియం పాఠశాలలు పూర్తిగా కనుమరుగు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. 

ఇరువురు వాదనలు, ప్రతినాదలు విన్న సుప్రీంకోర్టు ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత స్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన జీవో నెం.81, 85ను హైకోర్టు కొట్టేయడంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేయడం జరిగింది.