విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు అల్టిమేటమ్

బ్యాంకులకు సుమారు రూ.9,000 కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు అల్టిమేటమ్ జారీ చేసింది. అక్టోబర్ 5న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని సోమవారం ఆదేశించింది. విజయ్ మాల్యా కోర్టుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖకు సూచించింది.

తన పిల్లల బ్యాంకు ఖాతాలో 40 మిలియిన్ అమెరికా డాలర్లు బదిలీ చేసిన విజయ్ మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017లో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై ఆయన దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. అక్టోబర్ 5న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. విజయ్ మాల్యా భారత్‌కు వచ్చేలా చూడాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సూచించింది.

కాగా, 2016 నుంచి బ్రిటన్‌లో ఉన్న విజయ్ మాల్యాకు స్కాట్‌లాండ్ యార్డు కోర్టు 2017 ఏప్రిల్ 18న బెయిల్ మంజూరు చేసింది. నాటి నుంచి అక్కడే ఉన్న ఆయనను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

విజయ్ మాల్యాకు ఆశ్రయం కల్పించవద్దని కేంద్ర విదేశాంగ‌శాఖ జూన్ 11న బ్రిటన్‌ను కోరింది. మరోవైపు విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే చర్యలను బ్రిటన్ చేపట్టింది. అయితే దీనికి సంబంధించిన న్యాయ ప్రక్రియ పూర్తికావాలని పేర్కొంది.