కంగనా రనౌత్‌కు భద్రత కల్పించరే 

బాలీవుడ్‌కు డ్రగ్‌ మాఫియాతో ఉన్న సంబంధాలపై ఫైర్‌బ్రాండ్‌ నటి కంగనా రనౌత్ ట్వీట్‌ చేసిన అనంతరం ఆమెకు భద్రత కల్పించకపోవడం పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను బిజెపి  ప్రశ్నించింది. హిందీ సినీ పరిశ్రమకు డ్రగ్‌ మాఫియాతో సంబంధాలను అణిచివేయాలని డిమాండ్‌ చేసింది. 
 
బాలీవుడ్‌కు డ్రగ్‌ మాఫియాతో ఉన్న సంబంధాలను నిరూపిస్తానని ఆమె వెల్లడించి 100 గంటలు దాటినా ఆమెకు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు రాసిన లేఖలో బీజేపీ నేత రామ్‌ కదం ఆందోళన వ్యక్తం చేశారు. 
 
బాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నేతలను ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారని చెబుతూ బాలీవుడ్‌కు డ్రగ్‌ మాఫియాకు ఉన్న సంబంధాలను పూర్తిగా అణిచివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కంగనా రనౌత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించడం లేదని ఆయన నిలదీశారు. 
 
కంగనా వెల్లడించే అంశాలు పెద్దల బాగోతం బయటపడుతుందని భయం పట్టుకుందా అని ప్రశ్నించారు. డ్రగ్‌ మాఫియాతో రాజకీయ అనుబంధం కూడా బయటపడనుందా అని లేఖలో బీజేపీ నేత సందేహం వ్యక్తం చేశారు. 
 
సుశాంత్‌ మృతి కేసులో ప్రధాన నిందితురాలు, నటి రియా చక్రవర్తికి మహారాష్ట్ర  ప్రభుత్వం భద్రత కల్పించిందని, కంగనాకూ ఇదే తరహాలో ఇప్పటివరకూ భద్రత ఏర్పాట్లు చేయలేదని ఆయన మండిపడ్డారు.