చంద్రయాన్‌-3 ప్రయోగంపై ఇస్రో సన్నాహాలు  

భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-3ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో సన్నాహాలు ప్రారంభించింది. గతంలో చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో ఎదురైన వైఫల్యాలను అధిగమించేందుకు కసరత్తులు ప్రారంభించింది. 

ఇందుకు బెంగళూరు సమీపంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే బిలాలను కృత్రిమంగా సృష్టించి, ల్యాండర్‌ను పరీక్షించనుంది. ఇందుకు బెంగళూరుకు 215 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెల్లాకేరేలోని ఉల్లార్తిలో కృత్రిమ బిలాలను సృష్టించనున్నారు. సుమారు రూ.24.2 వ్యయంత పదిమీటర్ల వ్యాసార్థం, మూడు మీటర్ల లోతుతో తవ్వకాలు చేపట్టనున్నారు.

ఇప్పటికే టెండర్లు సైతం ఆహ్వానించగా, ఆగస్ట్‌ చివరి నాటికి, సెప్టెంబర్‌ మొదటి వారంలో పనులు పూర్తి కానున్నాయి. చంద్రయాన్‌-2 మిషన్‌లో ఆర్బిటార్‌ విజయవంతంగా పని చేస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగుతుండగా సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. 

దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రయోగంలో సెన్సార్ల పనితీరుపై ప్రధానంగా సారించి, పరీక్షలు చేస్తున్నారు. జాబిల్లి ఉపరితలంపై ల్యాండింగ్‌ ప్రదేశం ఎత్తుపల్లాలతో పాటు వేగాన్ని సెన్సార్లే సమన్వయం చేస్తాయి. దీంతో దీనిపై ప్రధానంగా దృష్టిపెట్టి సెన్సార్లు అమర్చిన ప్రత్యేక విమానాన్ని ఇస్రో ఉపయోగించి పనితీరును అంచనా వేయనుంది. 

ఏడు కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండింగ్‌ ప్రక్రియను సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు సెన్సార్లు చేసే మార్గనిర్దేశాన్ని పరిశీలించనున్నారు.

కాగా, చంద్రయాన్‌-3 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. చంద్రయాన్‌-2 ప్రయోగానికి ముందు కూడా ఇలాంటి బిలాలపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. అయితే ఇవి బహిరంగ  ప్రదేశంలో జరిగాయని, అయితే వాటిలో నాణ్యత కొరవడిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 

అందుకే ఈ సారి కృత్రిమ బిలాలను సృష్టించి ల్యాండర్‌ను పరీక్షించనున్నట్లు తెలిపారు. ఇందుకు బెంగళూరులోని ఇస్రో శాటిలైట్‌ ఇంటిగ్రేషనల్‌ టెస్ట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఐ సైట్‌లో పూర్తిలో ల్యాండర్‌పై పరిశోధనలు చేస్తుండగా ఈ సారి ప్రయోగంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.