బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్‌ బానిసలే 

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ బాలీవుడ్‌ నటుల‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో నెపోటిజంపై ఎప్పటికప్పుడు పరిశ్రమ పెద్దలపై తన పదునైన మాటలతో విమర్శిస్తూ కంగనా వార్తల్లో నిలుస్తున్నారు. కౌంటర్లు, ప్రతికౌంటర్లతో వారిపై విరుచుకుపడుతున్నారు. 
 
తాజాగా మరోసారి బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ పరిశ్రమలో 99 శాతం మంది డ్రగ్స్‌ను ఉపయోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. డ్రగ్స్‌ను సరఫరా చేసేవారిని విచారిస్తే చాలా మంది స్టార్స్‌ జైల్లోనే ఉండాల్సి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. 
 
అంతే కాకుండా ఓ స్టార్‌ హీరో డ్రగ్స్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఓసారి అతను ఆస్పత్రి పాలయ్యాడని, అందుచేతనే అతని భార్య అతనికి విడాకులిచ్చిందని చెప్పింది. ఆ సమయంలో తను అతనితో డేటింగ్‌లో ఉన్నానని కూడా చెప్పుకొచ్చింది. 
 
అంతేకాకుండా పరిశ్రమలో తనకు గురువు అని చెప్పుకునే వ్యక్తే తనకు డ్రగ్స్‌ రుచి చూపించారని ఆమె తెలిపింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మృతి కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని సిబిఐ ఇప్పటికే పలుసార్లు విచారించింది. 
 
అయితే రియా డ్రగ్స్‌ సరఫరాదారుల‌తో జరిపిన చాటింగ్‌ను సుశాంత్‌ సోదరి బయటపెట్టడంతో రియాకు డ్రగ్స్‌ సరఫరా దారుల‌తో సంబంధాలున్నట్లు సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమ పెద్దలపై కంగనా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి.