ఈ ఏడాది భక్తుల్లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

సెప్టెంబరు 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా స్వామివారి వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని, అక్టోబర్‌లో ఉత్సవాల సమయానికి కరోనా ప్రభావం తగ్గితే యథాతథంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. 

బర్డ్‌ ఆసుపత్రిలో నూతన గదుల నిర్మాణానికి రూ.5.5కోట్లు, విశాఖలోని ఆలయానికి రహదారి కోసం రూ.4.5 కోట్లు మంజూరు చేసినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. కరోనా బారిన పడిన టీటీడీ ఉద్యోగుల వైద్య ఖర్చులు టీటీడీ భరించాలని పాలకమండలి నిర్ణయించిందని తెలిపారు. 

ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో 214 గదుల వసతి గృహ నిర్మాణానికి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో విడతల వారిగా హాస్టల్ నిర్మాణం చేపట్టాలని బోర్డు  సూచించింది. 

బంగారు డిపాజిట్ పై చర్చించిన సాలక మండలి వాటిని 12 సంవత్సరాలు లాంగ్ టర్మ్ డిపాజిట్ చెయ్యాలని  నిర్ణయించారు. విజయవాడ, పోరంకిలో కళ్యాణమండపం నిర్మాణానికి  ఆమోదం తెలిపారు. అలాగే తిరుమలలో పేరుకుపోయిన  7 టన్నులు వ్యర్థాలను  తరలించడానికి టీటీడీ బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి ఆర్థిక విరాళం అందింంచారు.