తెలంగాణ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీలు, వీడీసీల ఆధ్వర్యంలో తీర్మానాలు చేస్తున్నారు. నిబంధనలు పాటించనివారికి జరిమానా విధిస్తున్నారు. 
 
కమ్మర్‌పల్లి మండలంలోని ఉప్లూర్‌ గ్రామంలో ఈ నెల 26 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సర్పంచ్‌ పద్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు. కూరగాయలు, కిరాణా దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే  తెరిచి ఉంచాలని సూచించారు. 
 
నందిపేట్‌ మండలం కుద్వాన్‌పూర్‌లో మొత్తం 32 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో గ్రామంలో లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ఆర్మూర్‌ మండలం సుర్భిర్యాల్‌ గ్రామంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ వినాయక నిమజ్జనం పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందని సర్పంచ్‌ సవిత తెలిపారు. గ్రామంలోని బ్యాంకు, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రధాన కూడళ్ల వద్ద సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 
 
మాక్లూర్‌ మండలం మాదాపూర్‌, మాక్లూర్‌ గ్రామాల్లో లాక్‌డౌన్‌ విధించారు. కిరాణా దుకాణాలు మధ్యాహ్నం ఒంటిగంట వరకే తెరిచి ఉంచుతున్నారు. హో టళ్లు, ఇతర దుకాణాలను పూర్తిగా మూసి ఉంచాలని పాలకవర్గం, వీడీసీ తీర్మానించాయి. 
 
రెంజల్‌ మండలం కందకుర్తి గ్రామం లో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సర్పంచ్‌ ఖలీంబేగ్‌ తెలిపారు. గ్రామంలో కరోనాతో ఒకరు మృతి చెందారని, మరొకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.