బీజేపీలో చేరిన కర్ణాటక ‘సింగం’

మాజీ ఐపీఎస్‌ అధికారి, కర్ణాటక  పోలీస్‌శాఖలో ‘సింగం’గా పేరొందిన అన్నామలై కుప్పుసామి మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. బీజెపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్. మురుగన్ సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. 
 
తమిళనాడులో బీజేపీ అనేక రంగాల ప్రముఖులను, వివిధ వర్గాలకు చెందిన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అన్నామలై కుప్పుసామి చేరికతో తమిళనాడులో పార్టీ మరింత బలపడుతుందని, ఆయన పార్టీకి ప్రధాన ఆకర్షణ అని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మురుగన్ పేర్కొన్నారు. 
 
పార్టీలో తనకు అవకాశం కల్పించిన పెద్దలకు కుప్పుస్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, పార్టీకి నమ్మకమైన సైనికుడిగా పనిచేస్తానని ఈ మాజీ ఐపీఎస్ అధికారి విలేకరులతోచెప్పారు.  
 
ఐపీఎస్ కు రాజీనామా చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఆలోచించి జాతీయ పార్టీగా దేశం గురించి ఆలోచించే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిజెపి పట్ల తమిళ ప్రజలలో అపోహాలున్నాయని చెబుతూ వారిలో పార్టీ గురించి సరైన అవగాహన ఆకలిగించడం కోసం కృషి ఉన్నదని చెప్పారు. 
 
తమిళనాడులో ద్రావిడ్ పార్టీల ప్రాబల్యం ఉన్నదని చెబుతూ నేడు ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని పేర్కొన్నారు. అక్కడ కుటుంభ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. 
 
కర్ణాటకలో ’సింగం’గా పేరొందిన  బెంగళూరు మాజీ సౌత్‌ డీసీపీ  అన్నామలై  ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌కు  గతేడాది  రాజీనామా చేశారు.   2011 బ్యాచ్‌ యువ ఐపీఎస్‌ అధికారి అన్నామలై  తమిళనాడులోని కరూర్‌ ప్రాంతానికి చెందినవారు.  2013లో కార్కళ ఏఎస్పీగా  సివిల్‌ సర్వీస్‌ కెరీర్‌  ప్రారంభించారు.